Lemon Price | ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో నిమ్మకాయలు వాడటం తప్పనిసరి. ఆహారంలో తీసుకున్నా.. ఉదయాన్నే నిమ్మకాయ షర్బత్ తాగినా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక వేసవిలో నిమ్మకాయ షర్బత్ తాగితే వడదెబ్బ ప్రభావం పడదు. కానీ ఇప్పుడు సామాన్యుడు కొనలేని స్థాయికి నిమ్మకాయ ధర పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఒక నిమ్మకాయ ధర రూ.15-20 మధ్య పలుకుతున్నది. నెల రోజుల క్రితం రూ.70-80లకు లభించిన కిలో నిమ్మకాయ కోసం ఇప్పుడు రూ.300-400 పెట్టాల్సి వస్తున్నది. ఈ లెక్కన నిమ్మకాయల ధరలు దాదాపు ఆరు రెట్లు పెరిగాయి.
నిమ్మకాయ తోటల పెంపకానికి ఆంధ్రప్రదేశ్ భూములు సరైనవి. నిరంతరం నీటి సరఫరా చేయాల్సిన అవసరం లేదు. మొక్క నాటిన 3-4 ఏండ్ల నుంచి మరో ఐదేండ్ల వరకు నిమ్మకాయలు పండుతునే ఉంటాయి. నిమ్మకాయ ధరల పెరుగుదలకు నాలుగు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. దేశంలోకెల్లా అతిపెద్ద నిమ్మకాయల మార్కెట్ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఉంది. ఏలూరు నుంచే దేశవ్యాప్తంగా 40-45 శాతం అవసరాలకు నిమ్మకాయలు రవాణా అవుతాయి. ఏలూరు మండిలో 20 వేల మందికి పైగా నిమ్మకాయల రైతులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు.
ఏలూరు నుంచి సాధారణంగా ప్రతిరోజూ 25 ట్రక్కుల నిమ్మకాయలు ఇక్కడి నుంచి దేశ నలుమూలలకు తరలి వెళ్తాయి. ఒక ట్రక్కులో 21 టన్నుల నిమ్మకాయలు ఉంటాయి. కానీ ఇప్పుడు కష్టంగా ఏలూరు నుంచి కేవలం ఐదు ట్రక్కుల నిమ్మకాయలు రవాణా అవుతున్నాయి. సాధారణ సీజన్తో పోలిస్తే ఐదు రెట్లు తక్కువ. ఇంకా బాలాజీ జిల్లాలోని గూడూరు మండి నుంచి, మరో 10 శాతం రాజమహేంద్రవరం (రాజమండ్రి) మండీల్లో లభిస్తాయి. అహ్మదాబాద్లోని అతిపెద్ద కూరగాయల మార్కెట్, జమల్పూర్, కలుపూర్, రాజస్థాన్లోని పాలివాల్ ప్రాంతాల్లో నిమ్మకాయలు ఎక్కువగా లభిస్తాయి.
ఒక టన్ను నిమ్మకాయల ధర రూ.5 లక్షల నుంచి రూ.31 లక్షలకు పెరిగింది. రెండేండ్లుగా రైతులు భారీగా నష్టపోయారు. దీనికి కారణం కరోనా మహమ్మారే. కరోనాను నిరోధించేందుకు నిమ్మకాయలు విరివిగా వాడినా దాని కట్టడికి 2020లో విధించిన లాక్డౌన్ వల్ల మార్కెట్లు తెరుచుకోలేదు. ఫలితంగా ఏలూరులో ఐదెకరాల్లో నిమ్మసాగు చేసిన రైతు నష్టపోయారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో నిమ్మకాయల దిగుబడి బాగా పడిపోయింది. ఫలితంగా ప్రజల నిత్యావసరాల్లో ఒకటైన నిమ్మకాయ కొరత ఏర్పడింది. దీంతో రూ.5 లక్షలు పలికిన టన్ను నిమ్మకాయలు ఇప్పుడు రూ.31 లక్షలకు దూసుకెళ్లాయి.
గుజరాత్లోని జమల్పూర్ కలూపూర్ మార్కెట్లలో కిలో నిమ్మకాయలు రూ.140-160 పలుకుతున్నాయి. నిమ్మకాయల విక్రయంతో తమకొచ్చే లాభాలు చాలా తక్కువ అని చెబుతున్నారు. గతేడాది తుపాన్ల వల్ల సౌరాష్ట్రలో నిమ్మతోటలు దెబ్బ తిన్నాయని చెబుతున్నారు. ఫలితంగా రైతులు కూడా నష్టపోయారు. రైతులకు ఆదాయం తగ్గడంతోనే నిమ్మకాయల ధరలు పెరిగాయంటున్నారు.
సౌత్ గుజరాత్ల్లో కిలో నిమ్మకాయలు రూ.200 లభిస్తుంటే, రిటైల్ దుకాణాల్లో రూ.300 పలుకుతున్నాయి. అహ్మదాబాద్లో రూ.140-160, మార్కెట్ బయట రూ.180-200లకు హోల్సేల్ వ్యాపారులు విక్రయిస్తున్నారు. చిన్న దుకాణాల వ్యాపారులు రూ.200-250కి కొనుగోలు చేస్తే సామాన్యుడి దగ్గరికి వచ్చే సరికి రూ.300-400లకు చేరుతున్నది.
గుజరాత్కు మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక రాష్ట్రాల నుంచి నిమ్మకాయలు రవాణా అవుతాయి. అహ్మదాబాద్లోనే రోజూ 150 టన్నులు వాడుతుంటారు. కానీ ఇప్పుడు రోజూ 70 టన్నులకు మించి నిమ్మకాయలు రాకపోవడం వల్లే వాటి ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ముస్లింలకు రంజాన్ మాసం రావడంతోపాటు ఈ నెలలో భారీగా పెండ్లిళ్లు జరుగుతాయని, కనుక నిమ్మకాయల ధరలు మరింత పెరగడం ఖాయం అంటున్నారు వ్యాపారులు.
రాజస్థాన్లోని ముహానా సబ్జీ మండి అధ్యక్షుడు రాహుల్ తవార్ మాట్లాడుతూ గతేడాది టైట్ తుఫాన్ వల్ల నిమ్మతోటలు దబ్బతిన్నాయని చెప్పారు. ఇంతకుముందుతో పోలిస్తే నిమ్మకాయల దిగుబడి బారీగా పడిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకూడా నిమ్మకాయల ధరలు పైపైకి దూసుకెళ్లాయంటున్నారు. రాజస్థాన్లో వర్షాలు కురిసిన తర్వాత నిమ్మకాయలు మార్కెట్లోకి వస్తే గానీ, వాటి ధరలు తగ్గవని వ్యాపారులు అంటున్నారు.