ముంబై, డిసెంబర్ 18: భారత ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) క్యూ కట్టారు. డిసెంబర్ నెల తొలి 15 రోజుల్లో ఈక్విటీల్లో రూ.42,733 కోట్లు (5.15 బిలియన్ డాలర్లు) పెట్టుబడి చేశారు. ఒక పక్షం రోజుల్లో ఎఫ్పీఐలు ఇంత పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రధమం. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ మొత్తంలో నిధుల్ని వెనక్కు తీసుకున్న ఎఫ్పీఐలు నవంబర్ ద్వితీయార్థం నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభించి, డిసెంబర్ తొలి రెండు వారాల్లో పెట్టుబడుల్ని వేగంగా పెంచుకుంటూపోయారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సంస్కరణలు కొనసాగుతాయన్న అంచనాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాలు, భారత జీడీపీ వృద్ధి అంచనాల్ని రిజర్వ్బ్యాంక్ పెంచడం తదితర అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపినట్టు విశ్లేషకులు చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ-50 లిస్టెడ్ కంపెనీల లాభాలు 15 శాతం మేర వృది ్ధచెందవచ్చని బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అనలిస్టులు ఒక తాజా నోట్లో పేర్కొన్నారు.
అయితే విదేశీ ఇన్వెస్టర్ల పొజిషన్లు ఇప్పటివరకూ భారత్ మార్కెట్లో తక్కువగా ఉన్నందున, కరెక్షన్లను కొనుగోళ్లకు ఉపయోగించుకుంటారని జెఫరీస్ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 15 వరకూ దేశంలోకి రూ.1.74 లక్షల కోట్ల ఎఫ్పీఐ నిధులు వచ్చినట్టు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.