యూఎస్, యూరప్ మార్కెట్లలో నెలకొన్న బలమైన అప్ట్రెండ్ను అనుసరిస్తూ విదేశీ ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ జరపడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ రికార్డు గరిష్ఠస్థాయికి చేరింది. వారం మొత్తంమీద 473 పాయింట్ల భారీ లాభంతో 20,268 పాయింట్ల వద్ద ముగిసింది. వచ్చే ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు నెలకొనడంతో యూఎస్ బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ హఠాత్తుగా పతనమయ్యాయి. దీంతో ఈక్విటీలు, బంగారం గత వారం పెద్ద ర్యాలీ జరిపాయి. అంతర్జాతీయ సంకేతాలతో పాటు ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ వారం ట్రెండ్ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు చెపుతున్నారు. అయితే నిఫ్టీ-50లో కీలక భాగమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆల్టైమ్ హైకి మరో 1,500 పాయింట్ల దూరంలో ఉన్నది. రానున్న రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ ముందంజవేయకపోతే, ప్రస్తుత నిఫ్టీ ర్యాలీకి బ్రేక్ పడవచ్చని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టీ మంథ్లీ చార్టుల్లో బుల్లిష్ క్యాండిల్ ఏర్పడిందని, డెయిలీ చార్టుల్లో బుల్లిష్ మూమెంటం కన్పిస్తున్నదని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది వివరించారు.
కీలక మద్దతు 20,100
ఈ వారం నిఫ్టీకి 20,100 పాయింట్ల మద్దతు కీలకమైనదని, ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 20,450-20,500 వరకూ ర్యాలీ కొనసాగుతుందని యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ రాజేశ్ పాల్వియా అంచనా వేశారు. ఈ వారం నిఫ్టీ 20,350 స్థాయిని అధిగమిస్తే 20,550-20,620 వరకూ పెరగవచ్చని జిమిత్ మోది విశ్లేషించారు. 20,000 స్థాయి వద్ద గట్టి మద్దతు లభిస్తున్నదని తెలిపారు. నిఫ్టీ తక్షణ లక్ష్యం 20,400-20,500 శ్రేణికాగా, ఈ శ్రేణిపైన ట్రేడయితే 20,700-20,800 వరకూ ర్యాలీ జరపవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ కునాల్ షా అంచనా వేశారు.