ప్రభుత్వ ఉద్యోగాలకు పెన్షన్ ఎలాగూ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత వాళ్లకు ఆర్థికంగా ఏదో ఒక భరోసా తప్పక ఉంటుంది. కానీ రెక్కలు ముక్కలు చేసుకుని 30, 40 ఏండ్లు పనిచేసి వయస్సు మీదపడిన ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితే కష్టం. పని చేయడం ఆగితే.. నెలనెలా వచ్చే జీతమూ ఆగుతుంది. అలాగని ఖర్చులు మాత్రం ఆగవు కదా?.. అయితే ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు, చిరు వ్యాపారస్తులు కూడా నెలనెలా పెన్షన్ పొందే వీలు కల్పిస్తోంది ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్). కేంద్ర ప్రభుత్వ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ కాబట్టి పెట్టిన పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు. ఇంతకీ ఏంటీ ఎన్పీఎస్.., ఎవరు అర్హులు..,
రిటైర్మెంట్ కోసం ముందు నుంచే దాచుకునే సౌలభ్యాన్ని కల్పించడానికి ఏర్పాటైందే ఈ ఎన్పీఎస్. ఇందులో ఎవరైనా క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టి రిటైర్మెంట్ వయస్సు తర్వాత నెలనెలా కొంత మొత్తాలను ఇక్కడ తీసుకోవచ్చు. పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పొదుపు పథకాన్ని నిర్వహిస్తున్నాయి.
శ్రీరాం వయస్సు ఇప్పుడు 30 ఏండ్లు. తను నెలనెలా రూ.5 వేలు ఎన్పీఎస్కు జమ చేస్తున్నాడు. 65 ఏండ్లు వచ్చేదాకా చెల్లించడానికి సిద్ధం. అంటే 35 ఏండ్లు పెట్టుబడి పెడతాడన్నమాట. ఇక ఈ పెట్టుబడులపై ఏటా కనీసం 10 శాతం రాబడి వస్తుందని ఆశిస్తున్నాడు శ్రీరాం. తనకు 65 ఏండ్లు వచ్చేనాటికి తాను పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.27.30 లక్షలు. కానీ అది లాభంతో రూ.2.48 కోట్లు అవుతుంది. అయితే ఈ మొత్తం తీసుకోవడానికి అవకాశం ఉండదు. 40 శాతం యాన్యుటీని కొనుగోలు చేసి దానిపై కనీసం 7 శాతం ఆదాయాన్ని ఆశించవచ్చు. ఈ లెక్కన అప్పుడు నెలనెలా రూ.58వేల పెన్షన్ అందుతుంది. అంతే కాదు రూ.99.53 లక్షల మొత్తం లంప్సమ్గా కూడా వస్తుంది.
భారతీయ పౌరులై ఉండాలి. దరఖాస్తు దాఖలు చేసే సమయానికి 18 నుంచి 70 ఏండ్లలోపు వయస్సుండాలి. కేవైసీ నిబంధనలకు అవసరమైన పత్రాలు ఇవ్వాలి.
మ్యూచువల్ ఫండ్స్, యూలిప్స్, పెన్షన్ ఫండ్స్ వంటి రకరకాల పెట్టుబడి మార్గాలున్నా ఎన్పీఎస్కు ఆదరణ ఎక్కువగా ఉండటానికి కారణం దాని చౌక నిర్వహణ ఖర్చులే. అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ చార్జీలు ఇందులో చాలా తక్కువ. సులువుగా ఖాతా తెరవవచ్చు. పోస్టాఫీసులతోపాటు ఎస్బీఐ శాఖలు, కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ ఖాతాను తెరిచి శాశ్వత రిటైర్మెంట్ నెంబర్ (PRAN) పొందవచ్చు. వయస్సుకు తగ్గట్టు రిస్క్ ఎంత తీసుకోవాలో మనమే నిర్ణయించుకోవచ్చు. లేదంటే ఆటో ఛాయిస్ ద్వారా ఫండ్ మేనేజర్ల అనుభవానికి వదిలేసే అవకాశమూ ఉంది. రాష్ర్టాలు, ఉద్యోగాలు మారినా ఖాతా మార్చుకోవాల్సిన పనేమీ ఉండదు. దేశంలో ఏ మూలన ఉన్నా ఈ ఎన్పీఎస్ ద్వారా నిధుల జమ, ఉపసంహరణలకు వీలుంటుంది.
తక్కువ వయస్సులో ఎన్పీఎస్లో పెట్టుబడిని ప్రారంభిస్తే.. చాలాకాలం చెల్లిస్తూపోవాలి. సెక్షన్ 80సీ, 80సీసీడీ(1), (2) కింద గరిష్ఠంగా రూ.2 లక్షల రూపాయల వరకూ ఆదాయపు పన్ను నుంచి మినహాయింపును పొందవచ్చు. అయితే రిటైర్మెంట్ వయస్సు తర్వాత విత్డ్రా చేసుకునే సమయంలో లంప్సమ్ సొమ్ముపై మాత్రం ఆదాయపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది.
– నాగేంద్ర సాయి కుందవరం