LIC | న్యూఢిల్లీ, మార్చి 13: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మార్కెట్ వాటా వేగంగా పడిపోతున్నది. గత 3 నెలల్లో దాదాపు 4 శాతం లేదా సుమారు 400 బేసిస్ పాయింట్లు దిగజారింది. గత ఏడాది నవంబర్ ఆఖర్లో 67.73 శాతంగా ఉన్న ఎల్ఐసీ మార్కెట్ వాటా.. ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో 63.8 శాతానికి క్షీణించింది. ఫిబ్రవరిలోనూ దాదాపు ఒక్క శాతం ఎల్ఐసీ మార్కెట్ వాటా పతనమైంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకొస్తున్నకొద్దీ బీమా ఇండస్ట్రీలో ప్రీమియం వసూళ్లు ఊపందుకొంటాయి. అయినప్పటికీ గత నెల ఎల్ఐసీ మార్కెట్ వాటా కోలుకోకపోవడం గమనించదగ్గ అంశంగా కనిపిస్తున్నది.
ఓవైపు మార్కెట్లో ఎల్ఐసీ జోరు తగ్గుతుంటే.. మరోవైపు ప్రైవేట్ బీమా సంస్థల హవా పెరుగుతుండటం గమనార్హం. జీవిత బీమా పరిశ్రమలో వసూలైన మొత్తం ఇన్సూరెన్స్ ప్రీమియంల ఆధారంగా ఈ మార్కెట్ వాటాను గణిస్తుంటారు. దీంతో ఎల్ఐసీ బీమా ప్రీమియం వసూళ్లు తగ్గుతుంటే.. దాని ప్రత్యర్థి సంస్థల బీమా కొనుగోళ్లు పెరుగుతున్నట్టు తాజా గణాంకాల్లో స్పష్టమవుతున్నది. ముఖ్యంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన అన్ని ప్రైవేట్ జీవిత బీమా కంపెనీలు నెలనెలా ఈ ప్రీమియం వసూళ్లను పెంచుకుంటూపోతున్నట్టు ఇప్పుడు తేలింది. పాలసీదారుల్లో ఎల్ఐసీకి ఎంతైతే ఆదరణ తగ్గుతున్నదో.. ప్రైవేట్ సంస్థలకు అంతే స్థాయిలో ఆదరణ పెరుగుతున్నది.
ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తుందన్న విషయం తెలిసిందే. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్తో మొదలవుతుందన్న సంగతీ విదితమే. దీంతో బీమా కంపెనీలకు ఈ నెల చాలా కీలకంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. కొత్త పన్ను విధానం, నియమ నిబంధనల్లో మార్పులు వంటివి వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుండటంతో చాలామంది తమ సేవింగ్స్ ప్లాన్లకు పదును పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో పన్ను ఆదా కోసం తీసుకునే నూతన పాలసీలతో ప్రీమియం వసూళ్లు సహజంగానే పెరుగుతాయంటున్నారు. ఫలితంగా పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ నెల గడిస్తే ఎల్ఐసీ మార్కెట్ వాటా మరింత తగ్గవచ్చన్న అభిప్రాయాలున్నాయి.
నిరుడు నవంబర్ నుంచి హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ వాటా 72 బేసిస్ పాయింట్లు వృద్ధి
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ వాటా కూడా పైపైకే
గత 3 నెలల్లో 4 శాతం మార్కెట్ వాటాను పెంచుకున్న ప్రైవేట్ కంపెనీలు
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్యే సుమారు 100 బేసిస్ పాయింట్లు లేదా ఒక్క శాతం ఎగబాకిన ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మార్కెట్ వాటా
అదానీ ఎఫెక్ట్.. దేశీయ మార్కెట్లోని ఎల్ఐసీ షేర్ల ట్రేడింగ్పైనా కనిపిస్తున్నది
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా 16 శాతం పతనమైన ఎల్ఐసీ షేర్ల విలువ
అదానీ గ్రూప్ సంస్థల్లో ఎల్ఐసీ పెట్టుబడులు.. వాటి విలువ క్షీణత గురించి తెలిసిందే. హిండెన్బర్గ్ రిపోర్టు నేపథ్యంలో కుప్పకూలిన అదానీ షేర్లలో.. ఎల్ఐసీ వాటాలూ ఉన్నాయి. చివరకు ఈ అంశం పార్లమెంట్నూ తాకింది. దీంతో ఈ పరిణామాలు సగటు పాలసీదారులను తీవ్రంగానే ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఎక్కడ తమ సొమ్మును మింగేస్తాయా? అన్న భయం కూడా మెజారిటీ పాలసీదారులను వేధిస్తున్నదని చెప్తున్నారు. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ మంది ఎల్ఐసీనే విశ్వసిస్తున్నారు. అలాంటిదిప్పుడు ఎల్ఐసీపై భరోసా తగ్గుతున్నది. దాని ఫలితమే పాలసీలకు ఆదరణ పడిపోతుండటం. ఈ మార్కెట్ వాటా క్షీణతకూ అదే నిదర్శనం. ఇక ప్రైవేట్ కంపెనీలపై నమ్మకం లేనివారు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రభుత్వ సంస్థల అనుబంధ విభాగాలవైపూ నడుస్తున్నారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ వాటా 89 బేసిస్ పాయింట్లు పెరగడమే ఇందుకు రుజువు.
ఎల్ఐసీకి కొత్త సారథి రావడం వెనుక కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత చైర్మన్ మంగళం రామసుబ్రమణ్యన్ కుమార్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించలేదు. ఈ క్రమంలోనే ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతీకి ఎల్ఐసీ చైర్మన్గా అదనపు బాధ్యతల్ని అప్పగించారు. ఈ నియామకం మంగళవారం నుంచి అమల్లోకి రానుండగా.. 3 నెలలపాటు మహంతీ ఈ బాధ్యతల్లోనే ఉండనున్నారు. అయితే అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడులు.. వాటిపై నష్టాలు.. దిగజారుతున్న సంస్థ మార్కెట్ వాటా.. అదానీ గ్రూప్తో చర్చలు.. ఆ తర్వాత ఎంఆర్ కుమార్ అభిప్రాయం.. అన్నీ విమర్శలకు దారితీసిన నేపథ్యంలోనే ఈ కొత్త చైర్మన్ రాక అన్న విశ్లేషణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అదానీ గ్రూప్పై తమకు మరింత విశ్వాసం పెరిగిందని ఇటీవల కుమార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా, ఎల్ఐసీ ఎండీగా మహంతీ.. ఈ ఏడాది జూన్ 30న పదవీవిరమణ చేయనున్నారు. 2021 ఫిబ్రవరి 1న బాధ్యతలను చేపట్టారు. ఎల్ఐసీకి ఒక చైర్మన్, నలుగురు ఎండీలుంటారు. మహంతీతోపాటు బిష్ణు చరణ్ పట్నాయక్, ఐపే మిని, రాజ్కుమార్లు ఎండీలుగా కొనసాగుతున్నారు. దేశంలోనే ఎల్ఐసీ అతిపెద్ద బీమా సంస్థ. ప్రపంచంలో ప్రీమియంలపరంగా ఐదో స్థానంలో, ఆస్తులపరంగా పదో స్థానంలో ఉన్నది.