ముంబై, నవంబర్ 11: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కానీ, ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని యథాతథంగా ఉంచిన బ్యాంక్..మిగతా రుణాలపై రేట్లను సవరించింది.
నెల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8.25 శాతం నుంచి 8.30 శాతానికి పెంచిన బ్యాంక్..మూడు నెలల రుణాలపై రేట్లను 8.35 శాతం నుంచి 8.40 శాతానికి, ఆరు నెలల రుణాలపై రేట్లను కూడా 8.45 శాతం నుంచి 8.55 శాతానికి సవరించింది. అలాగే అత్యధిక మంది తీసుకునే ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 5 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణ రేటు 8.70 శాతం నుంచి 8.75 శాతానికి పెంచింది. పెరిగిన వడ్డీరేట్లు ఆదివారం నుంచి అమల్లోకొస్తాయి.