Telangana | తెలంగాణలో పారిశ్రామికరంగం శరవేగంగా దూసుకుపోతున్నది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఉత్పత్తి జరగడం ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు లభిస్తున్నది. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్లో పారిశ్రామికవాడలుగా గుర్తింపు పొందిన ప్రాంతాలు కాలక్రమంలో నగరంలో అంతర్భాగం కాగా.. ఇప్పుడు నగర శివార్లలో ఏర్పాటైన ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఆయా ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి.
ఉదాహరణకు మహేశ్వరం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు, ముచ్చర్ల ఫార్మాసిటీకి, ఆదిబట్ల ఏరోస్పేస్, డిఫెన్స్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందాయి. ఇవికాకుండా ఆహార ఉత్పత్తుల కోసం 9 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో ప్రత్యేక ఆహార శుద్ధి మండళ్లను ఏర్పాటు చేశారు. గతంలో హైదరాబాద్లో వీఎస్టీ, కాటేదాన్, బాలానగర్, జీడిమెట్ల, నాచారం, ఉప్పల్ తదితర ప్రాంతాలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పారిశ్రామికవాడలుగా గుర్తింపు పొందాయి. కానీ, వాటిలో ఒకేరకమైన వస్తువులు కాకుండా అన్ని రకాల ఉత్పత్తులు తయారయ్యేవి. అప్పట్లో హైదరాబాద్ శివార్లలో ఉన్న ఈ పారిశ్రామికవాడలు కాలక్రమంలో నగరంలో విలీనమవడంతో నివాస ప్రాంతాలుగా మారి గత ప్రాభవాన్ని కోల్పోతున్నాయి.
ఉదాహరణకు వీఎస్టీ, ఉప్పల్, నాచారం, కాటేదాన్ తదితర ప్రాంతాల్లో గతంలో పరిశ్రమలు కొనసాగినచోట ఇప్పుడు అపార్ట్మెంట్లు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం నగర శివారు ప్రాంతాల్లో అనేక కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేసింది. ఇప్పుడవి ప్రత్యేకమైన ఉత్పత్తులకు కేంద్రాలుగా మారిపోయి ఆయా ప్రాంతాలకు గుర్తింపు తెస్తున్నాయి. ఒకే రంగానికి చెందిన పరిశ్రమలు సమూహంగా ఉండడంవల్ల బహుళ ప్రయోజనాలుంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా రంగాలవారీగా ప్రత్యేక ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నది.
ఒకేచోట ఒకే రకమైన ఉత్పత్తులు తయారు కావడంవల్ల ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా భౌగోళిక గుర్తింపు లభిస్తున్నది. ఇలా అభివృద్ధి చేసిన క్లస్టర్లలో ఔత్సాహికులకు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో సబ్సిడీ రేట్లకే భూములను కేటాయిస్తున్నారు. ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహకాలు సులభంగా లభిస్తుండడంతో ఈ క్లస్టర్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఇలాంటి ఇండస్ట్రియల్ క్లస్టర్ల వల్ల ఆయా ఉత్పత్తులకు అవి కేంద్రాలుగా మారడమే కాకుండా పరోక్షంగా ఆ రంగానికి సంబంధించిన అనుబంధ వ్యాపారాల వృద్ధికి దోహదపడుతున్నాయి.
ముచ్చెర్ల ఫార్మాసిటీని దేశంలోనే అతిపెద్ద ఔషధ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో అన్ని రకాల ఔషధాల ఉత్పత్తి జరిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ క్లస్టర్లో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. కొరియన్ కంపెనీ యంగ్వన్, మన దేశానికి చెందిన అంతర్జాతీయ సంస్థ కిటెక్స్ వంటి సంస్థలు అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయి. మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్లో అనేకరకాల వైద్య పరికరాలు తయారవుతున్నాయి. ఫైబర్ గ్లాస్ కాంపోజిట్కు డిమాండ్ పెరుగుతుండటంతో ఇబ్రహీంపట్నంలో ప్రత్యేకంగా క్లస్టర్ను అభివృద్ధి చేశారు.