తీవ్ర ఒడిదొడుకుల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం లాభాలనే అందుకున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు.. భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసినప్పటికీ మదుపరులు వారాంతంలో కొనుగోళ్లతో మద్దతు పలికారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,289.57 పాయింట్లు ఎగిసి 82,408.17 వద్ద నిలిచింది.
ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 393.80 పాయింట్లు ఎగబాకి 25,112.40 దగ్గర స్థిరపడింది. అయితే ఈ వారం పశ్చిమాసియా దేశాల్లోని ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఆ ప్రభావం దేశీయ ఈక్విటీలపై స్పష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ముడి చమురు ధరలు విజృంభిస్తే.. ఆయిల్-గ్యాస్ రంగాలతోపాటు రవాణా, బ్యాంకింగ్, ఆటో, నిర్మాణ తదితర రంగాల షేర్ల కదలికలు కీలకంగా మారనున్నాయి.
ఇక ఎప్పట్లాగే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, దేశీయ మార్కెట్లను నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,700 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,500 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. కానీ సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,400-25,600 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.