న్యూఢిల్లీ, జూన్ 12: దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మళ్లీ నిరాశపర్చింది. కీలకమైన తయారీ, విద్యుదుత్పత్తి, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ప్రాథమిక-ముడి సరకు వస్తూత్పత్తి, గనుల రంగాల్లో కార్యకలాపాలు నీరసించాయి. ఈ క్రమంలోనే గత ఏడాది ఏప్రిల్లో 6.7 శాతంగా ఉన్న ఐఐపీ.. ఈ ఏడాది ఏప్రిల్లో 4.2 శాతానికి క్షీణించింది. ఈ మేరకు సోమవారం జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన వివరాల్లో తేలింది. అయితే కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి నిరుడుతో పోల్చితే ఈ ఏప్రిల్లో మైనస్ 0.8 శాతం నుంచి 10.7 శాతానికి, మౌలిక/నిర్మాణ రంగ వస్తూత్పత్తి 4 శాతం నుంచి 12.8 శాతానికి పెరిగాయి. అయినప్పటికీ ఇతర కీలక రంగాలు నిరాశాజనకంగా ఉండటంతో ఐఐపీ గణాంకాలూ దిగజారాయి. కాగా, ఈ ఏడాది మార్చితో చూస్తే ఏప్రిల్లో ఐఐపీ 1.7 శాతం నుంచి 4.2 శాతానికి పుంజుకున్నట్టు కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐఐపీ వృద్ధిరేటు 5.2 శాతంగా ఉండగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) 11.4 శాతంగా ఉండటం గమనార్హం.
ఆర్థిక మాంద్యం భయాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభం తదితర పరిణామాలతో దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగం ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఈ తరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు నుంచి చేయూత కొరవడటం ఆందోళన కలిగిస్తున్నదని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉన్న కీలక రంగాలు డీలా పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులూ పరిస్థితుల్ని మరింతగా దిగజార్చుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల రెండేండ్ల కనిష్ఠానికి దిగొచ్చింది. మేలో 25 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 4.25 శాతంగా నమోదైంది.