Infrastructure Sector | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: దేశంలో మౌలిక రంగాల వృద్ధి నెమ్మదించింది. జనవరిలో 15 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 8 కీలక రంగాల వృద్ధిరేటు 3.6 శాతంగానే నమోదైంది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, విద్యుత్తు తదితర రంగాల్లో పనితీరు పేలవంగా ఉండటమే ఇందుకు కారణమని గురువారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్తు తదితర 8 కీలక రంగాల్లో వృద్ధిరేటు గత ఏడాది డిసెంబర్లో 4.9 శాతంగా ఉన్నది.
నిరుడు జనవరిలోనైతే ఇది 9.7 శాతం. ఇదిలావుంటే 2022 అక్టోబర్లో 0.9 శాతంగా ఈ 8 కీలక రంగాల వృద్ధిరేటు నమోదైంది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయి కనిష్ఠానికి దిగజారింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్-జనవరిలో కీలక రంగాల వృద్ధిరేటు 7.7 శాతంగా ఉన్నది. అయితే గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే వ్యవధిలో 8.3 శాతంగా ఉన్నది.
రిఫైనరీ, ఎరువుల రంగాల్లో ఉత్పాదక వృద్ధిరేటు జనవరిలో ప్రతికూలంగా నమోదైంది. అయితే ముడిచమురు, సహజ వాయువు, సిమెంట్ రంగాల్లో ఉత్పత్తి వృద్ధిదాయకంగా ఉన్నది. బొగ్గు, ఉక్కు, విద్యుత్తు రంగాల్లో ఉత్పాదకత సైతం నిరాశాజనకంగానే కనిపిస్తున్నది. ఇక ఈ 8 కీలక రంగాల వాటా.. దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40.27 శాతంగా ఉంటున్నది.