TS iPASS |హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నూతన ఇండస్ట్రియల్ పార్క్ల ఏర్పాటునకు సంబంధించి అధికార యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన పాలసీలో కొన్ని మార్పులు చేసి విడుదల చేయడానికి రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల కోసం ఎంపికచేసిన భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని టీఎస్ఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది కూడా. టీఎస్ ఐపాస్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్నే కాస్త అటుఇటుగా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల స్థలాన్ని పరిశ్రమల కోసం కేటాయించగా..దీంట్లో దాదాపు 28 వేల ఎకరాలను ఇప్పటికే పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. అలాగే, కొత్తగా ఏర్పాటు చేయనున్న పారిశ్రామికవాడల్లో కూడా ఎంఎస్ఎంఈలకే ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించారు.