న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశ ఎగుమతులు-దిగుమతుల మధ్య అంతరం ఎంతకూ దిగడం లేదు. నిరుడుతో పోల్చితే గత నెలలో వాణిజ్య లోటు దాదాపు మూడింతలు ఎగిసింది. జూలైలో 30 బిలియన్ డాలర్లుగా ఉన్నది. గత ఏడాది జూలైలో ఇది 10.63 బిలియన్ డాలర్లే. కాగా, ఈసారి ఎగుమతులు 36.27 బిలియన్ డాలర్లుగా ఉంటే, దిగుమతులు 66.27 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఎగుమతుల్లో 2.14 శాతం, దిగుమతుల్లో 43.61 శాతం పెరుగుదల కనిపించింది.
జూలైలో ముడి చమురు దిగుమతులు 70 శాతానికిపైగా పెరిగాయి. క్రూడ్, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 21.13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నిరుడు ఇదే నెల 12.4 బిలియన్ డాలర్లే. బొగ్గు, కోక్, బ్రికెట్స్ దిగుమతులూ రెండింతలు ఎగిసి 5.2 బిలియన్ డాలర్లను తాకాయి. అయితే బంగారం దిగుమతులు 43.6 శాతం తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది జూలైతో పోల్చితే ఈసారి 4.2 బిలియన్ డాలర్ల నుంచి 2.37 బిలియన్ డాలర్లకు దిగాయి. ఇక ఎగుమతుల్లో ఇంజినీరింగ్, రత్నాలు, ఆభరణాలు, ఔషధాలు, ప్లాస్టిక్, జీడిపప్పు, కార్పెట్లు క్షీణించాయి. తోలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కాఫీ ఎగుమతులు పెరిగాయి. కాగా, ఈసారి ఎగుమతుల్లో సేవా రంగం విలువ 24.91 బిలియన్ డాలర్లుగా, దిగుమతుల్లో 15.95 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు అంచనా. గతంతో పోల్చితే 28.69 శాతం, 40.02 శాతం చొప్పున పెరిగాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) స్వల్పంగా తగ్గింది. జూలైలో 6.71 శాతంగా నమోదైంది. జూన్లో ఇది 7.01 శాతంగా ఉన్నది. అయితే నిరుడు జూలైలో 5.59 శాతంగానే ఉండటం గమనార్హం. ఆహారోత్పత్తుల ధరలు కొంతమేరకు శాంతించినట్టు తాజా గణాంకాల్లో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది.
కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిమితి (6 శాతం)కి మించే ఇంకా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ రిటైల్ ధరల సూచీ ఆధారంగానే ఆర్బీఐ కీలక వడ్డీరేట్లపై ద్రవ్యసమీక్షల్లో నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెపోరేటు 1.4 శాతం ఎగబాకింది. దీంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను బ్యాంకులూ పెంచేశాయి. తాజా గణాంకాల మధ్య మున్ముందు మరిన్ని వడ్డింపులు తప్పవేమోనన్న అంచనాలున్నాయి.
విదేశీ మారకం నిల్వలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 5తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 897 మిలియన్ డాలర్లు తగ్గి 572.978 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలో రిజర్వులు 2.315 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ కరిగిపోవడం వల్లనే నిల్వలు తగ్గాయని పేర్కొంది. గతవారంలో 1.611 బిలియన్ డాలర్లు తగ్గి 509.646 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు, పసిడి రిజర్వులు మాత్రం 671 మిలియన్ డాలర్లు పెరిగి 40.313 బిలియన్ డాలర్లకు చేరాయి.
దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) మళ్లీ నెమ్మదించింది. ఈ ఏడాది మే నెలతో చూస్తే జూన్లో వృద్ధి సూచీ బాగానే తగ్గింది. మేలో 19.6 శాతంగా ఉంటే, జూన్లో 12.3 శాతానికే పరిమితమైంది. నిరుడు జూన్లోనూ ఐఐపీ 13.8 శాతంగా నమోదైనట్టు తాజా గణాంకాలనుబట్టి తెలుస్తున్నది. తయారీ, విద్యుత్తు, గనుల రంగాల పనితీరు ఆశాజనకంగా ఉన్నా.. ఆకర్షణీయ స్థాయిలో లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.