న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రికార్డు గరిష్ఠస్థాయి సమీపంలో ధర ఉన్నందున, ఇతర ప్రపంచదేశాల కేంద్రబ్యాంక్ల బాటలోనే రిజర్వ్బ్యాంక్ బంగారం కొనుగోళ్లకు తగ్గిస్తున్నది.2023లో గత ఆరేండ్లలో ఎన్నడూలేనంత తక్కువ పుత్తడిని కొన్నది. 2023 డిసెంబర్ చివరినాటికి ఆర్బీఐ వద్ద 25.84 మిలియన్ల ఔన్సుల బంగారం నిల్వలు ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇవి 25.32 మిలియన్ ఔన్సులుకాగా, గత ఏడాది మొత్తం మీద ఆర్బీఐ 52 మిలియన్ ట్రాయ్ ఔన్సుల పుత్తడిని మాత్రమే కొనుగోలు చేసింది.
ఒక ట్రాయ్ ఔన్సు 31.1 గ్రాములకు సమానం. విదేశీ మారక నిల్వల్ని వివిధీకరించే వ్యూహంలో భాగంగా 2017 డిసెంబర్లో బంగారాన్ని కొనడం ప్రారంభించిన తర్వాత ఇంత కనిష్ఠంగా నిల్వల్ని పెంచుకోవడం ఇదే ప్రధమం. వాస్తవానికి పరిమాణం రీత్యా కొనుగోళ్లు తగ్గినప్పటికీ, డాలర్ల నిల్వలతో పోలిస్తే బంగారానికి ఆర్బీఐ అధికంగానే కేటాయిస్తున్నదని, విలువ పెరిగినందున తక్కువ పరిమాణంలో పుత్తడి నిల్వలు సమకూరుతున్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవీస్ చెప్పారు.
రిజర్వ్బ్యాంక్ వద్ద 2023 సెప్టెంబర్ చివరినాటికి 800.79 మెట్రిక్ టన్నుల బంగారం (39.89 టన్నుల గోల్డ్ డిపాజిట్లతో సహా) ఉన్నది. ఇందులో 388.06 టన్నుల బంగారాన్ని విదేశాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) కస్టడీలో ఉంచగా, 372.84 టన్నులు దేశీయంగా భద్రపర్చింది. విలువరీత్యా చూస్తే ఆర్బీఐ వద్దనున్న విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా గత ఏడాది సెప్టెంబర్ చివరినాటికి మార్చినెలతో పోలిస్తే 7.81 శాతం నుంచి 7.37 శాతానికి తగ్గింది.
2023 డిసెంబర్నాటికి ఫారెక్స్ రిజర్వుల్లో పుత్తడి వాటా 7.7 శాతానికి పెరిగింది. 2023లో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం సగటు ధర 1,940 డాలర్లుగా ఉన్నది. 2022లో సగటు ధరకంటే ఇది 8 శాతం అధికం. అయినప్పటికీ ఇతర కేంద్ర బ్యాంక్ల్లా లాభాల స్వీకరణలో భాగంగా ఆర్బీఐ మాత్రం బంగారాన్ని విక్రయించలేదు.