హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగం జోరందుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీతో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఐదు ప్రముఖ కంపెనీలు రూ.5,147 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
సెంచరీ దాటిన పెట్రోల్ ధరలు, పర్యావరణ ఆందోళనల మధ్య ఈవీలకు గిరాకీ పెరుగుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా చార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీ స్టేషన్లూ ఏర్పాటవుతున్నాయి. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఇప్పటికే 110 చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు వీటి నెట్వర్క్ను మరింత పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
ఈవీ పాలసీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భారీ రాయితీలు కలిసొస్తున్నాయి. ఈవీల కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు కూడా తమ పరిశ్రమల స్థాపనకు తెలంగాణను ఎంచుకొంటున్నాయి. రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలకుతోడు స్నేహపూర్వక వాతావరణం సైతం తెలంగాణను ఈవీ-హబ్గా మారుస్తున్నాయిప్పుడు. గత ఆర్థిక సంవత్సరం రూ.5 వేల కోట్లకుపైగా పెట్టుబడులు రాగా, తద్వారా 20 వేలకుపైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తెలంగాణలో ఈవీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రత్యేక శ్రద్ధతో అమెరికా, దావోస్ పర్యటనల్లో వివిధ అంతర్జాతీయ కంపెనీలతో సమావేశమైనది తెలిసిందే. ఈ సందర్భంగా భారత్లో ఈవీలకున్న మార్కెట్ను, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వివరించారు. దీంతో ఆయా సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపాయి.
తెలంగాణ భౌగోళికంగా భారత్కు మధ్యలో ఉండటం పరిశ్రమలకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇటు దక్షిణాది రాష్ర్టాలు, అటు ఉత్తరాది రాష్ర్టాలకు తేలిగ్గా ఎగుమతి చేసేందుకు వీలవుతుంది. అంతేకాదు రాష్ట్రంలో సరిపడా ల్యాండ్ బ్యాంక్ ఉండటం, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ,సహకారాలు లభించడం కంపెనీలకు ప్రయోజనకరంగా మారింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా త్వరితగతిన, అత్యంత సులభంగా అనుమతులు మంజూరు చేయడం కూడా పరిశ్రమలను రాష్ట్రం వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి.