Stock Market | ముంబై, ఫిబ్రవరి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు ఐటీ, బ్యాంకింగ్ షేర్లు గండికొట్టాయి. దీంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వారాంతం ట్రేడింగ్లో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 15.44 పాయింట్లు తగ్గి 73,142.80 పాయింట్లకు జారుకున్నది.
ఇంట్రాడేలో రికార్డు స్థాయి 22,297 పాయింట్లను తాకిన నిఫ్టీ చివరకు 4.75 పాయింట్లు కోల్పోయి 22,212.70 వద్ద ముగిసింది. వారాంతం ట్రేడింగ్లో హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, మారుతి, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఎస్బీఐ, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్లు నష్టపోగా..బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఎల్అండ్టీ, విప్రో షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఎనర్జీ, బ్యాంకింగ్ రంగ సూచీలు నష్టపోయాయి. కానీ, ఇండస్ట్రీయల్స్, టెలి కమ్యూనికేషన్స్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఒక్క శాతం పెరిగి 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియో ఫిన్ సర్వీసెస్ మరో రికార్డును సాధించింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2 లక్షల కోట్లు దాటి రూ.2.20 లక్షల కోట్లకు చేరుకున్నది. శుక్రవారం ఇంట్రాడేలో 15 శాతం వరకు లాభపడిన కంపెనీ షేరు ధర చివరకు 10.18 శాతంతో రూ.333.90 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈలోనూ కంపెనీ షేరు 10.62 శాతం ఎగబాకి రూ.335కి చేరుకున్నది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.27, 922.69 కోట్లు ఎగబాకి రూ.2,20,458.96 కోట్లకు చేరుకున్న విలువ చివరకు రూ.2,12,136.16 కోట్ల వద్ద ముగిసింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ కూడా రూ.20,20,470.88 కోట్లకు చేరుకున్నది. రిలయన్స్ షేరు ధర 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నది.