న్యూఢిల్లీ, జూన్ 18: ఎప్పట్నుంచో వేచిచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ ఎట్టకేలకు వచ్చేస్తున్నది. తమ ప్రస్తుత వాటాదారుల కోసం భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సిద్ధమైంది. ఈ మెగా ఐపీవో విలువ ఏకంగా రూ.30,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా మరి. దీంతో హ్యుందాయ్ మోటర్ ఇండియా రూ.27,870 కోట్ల ఐపీవో రెండో స్థానానికి పడిపోనున్నది. ఇక పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)తో దీన్ని తెస్తుండగా, ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి బుధవారమే దాఖలు చేసింది దేశీయ అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్గా ఉన్న ఎన్ఎస్ఈ. ప్రతిపాదిత ఐపీవో ద్వారా ఎన్ఎస్ఈ విలువను రూ.5 లక్షల కోట్లుగా లెక్కిస్తున్నారు. ఇది.. ప్రపంచంలోని అత్యంత విలువైన లిస్టెడ్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్లలో ఒకటిగా ఎన్ఎస్ఈని నిలబెడుతున్నది.
మదుపర్లకు జాక్పాట్?
ఈ ఐపీవోతో ఎన్ఎస్ఈలో ఉన్న వాటాదారులు, సంస్థాగత మదుపర్లు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమ సీనియర్లకు వేలాది కోట్ల రూపాయల లాభాలు వచ్చినట్టేనన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. బిలియనీర్ ఇన్వెస్టర్, డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ ధమానీకి ఎన్ఎస్ఈలో 1.58 శాతం వాటా ఉన్నది. అలాగే హీరో ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ కాంత్ ముంజల్కు 1.02 శాతం వాటా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్ గోపాలక్రిష్ణన్, సిద్ధార్థ్ బాలచంద్రన్కు 0.38 శాతం చొప్పున వాటాలున్నాయి. ప్రస్తుత అన్లిస్టెడ్ మార్కెట్ వాల్యుయేషన్స్ (ఒక్కో షేర్ విలువ రూ.2,050 పైనే) ప్రకారం ఈ వాటాల విలువ వరుసగా.. రూ.7,817 కోట్లు, రూ.2,040 కోట్లు, రూ.1,886 కోట్ల చొప్పున ఉండొచ్చని అంటున్నారు. మొత్తంగా ప్రస్తుత వాటాదారులకు 14.89 కోట్ల షేర్లున్నాయి. ఇందులో దాదాపు 6 శాతం ఇప్పుడు ఐపీవో ద్వారా అమ్మకానికి రానున్నది. ఎస్బీఐ కూడా 2.47 కోట్ల షేర్లను అమ్మాలని చూస్తున్నది.
5 రోజుల్లో.. రూ.25.27 లక్షల కోట్లు అప్
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలతో మదుపర్ల సంపద భారీగా పెరుగుతున్నది. 5 రోజుల్లో రూ.25.27 లక్షల కోట్లు ఎగిసింది. గురువారం కూడా బీఎస్ఈ సెన్సెక్స్ 254.36 పాయింట్లు పెరిగింది. దీంతో గత 5 రోజుల్లో 3,577.43 పాయింట్లు లేదా 4.84 శాతం సూచీ ఎగబాకినైట్టెంది. ఈ క్రమంలోనే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.25,27,159. 17 కోట్లు పుంజుకొని రూ.4,77,60,939. 62 కోట్లకు చేరింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ గురువారం 82.30 పాయింట్లు పెరిగింది.