Mutual Funds | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈ ఏడాది మెప్పించింది. 2022లో నిరాశపర్చిన పరిశ్రమ.. 2023లో తిరిగి పుంజుకున్నది. ఈక్విటీలు, గోల్డ్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఈల్డ్స్ అంటూ అన్నింటా పెట్టిన పెట్టుబడులు గణనీయంగా ఎగిశాయి. ఈ క్రమంలోనే మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఈ ఒక్క ఏడాదే (జనవరి నుంచి నవంబర్ వరకు) ఏకంగా రూ.9 లక్షల కోట్లు (23 శాతం) పెరగడం గమనార్హం.
గత ఏడాది మొత్తంగా పెరిగింది రూ.2.5 లక్షల కోట్లే (7 శాతం). కాగా, 2022 ఆఖరుకల్లా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఏయూఎం రూ.40 లక్షల కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి రూ.49 లక్షల కోట్లకు చేరింది. ఇది ఆల్టైమ్ హై కావడం విశేషం. 2021లో సుమారు 22 శాతం వృద్ధితో రూ.7 లక్షల కోట్ల ఆస్తులు పెరిగాయి. దీంతో గడిచిన మూడేండ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఆధ్వర్యంలోని ఆస్తులు రూ.18 లక్షల కోట్లు ఎగబాకినైట్టెంది. ఇదిలావుంటే వచ్చే నెల తొలి వారంలో ఈ నెల ఆస్తుల వివరాలూ రానున్నాయి. దీంతో ఎంఎఫ్ ఏయూఎం రూ.50 లక్షల కోట్ల మార్కును దాటవచ్చన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది రికార్డు లాభాల్లో పరుగులు పెట్టాయి. మునుపెన్నడూ లేనివిధంగా అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీలు చారిత్రక స్థాయిల్లో కదలాడుతున్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్టుగానే ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టిన ఎంఎఫ్ అసెట్స్ కూడా పెరుగుతూపోయాయి. మదుపరులకు బీఎస్ఈ లార్జ్క్యాప్ 19 శాతం, మిడ్క్యాప్ 45 శాతం, స్మాల్క్యాప్ 47 శాతం చొప్పున రిటర్న్స్ ఇచ్చాయి. కాగా, స్థిరంగా ఉన్న వడ్డీరేట్లు, జోరుగా సాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణ సైతం కలిసొచ్చాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. సమీప భవిష్యత్తులోనూ ఇదే జోష్ ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం విశేషం.