న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా పెరిగింది. నిరుడుతో పోల్చితే గత నెల కార్యాలయ స్థలాల లీజులు రెట్టింపునకుపైగా పెరిగాయి. హైదరాబాద్సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో జూలై ఆఫీస్ స్పేస్ లీజింగ్ 8.8 మిలియన్ చదరపు అడుగులను తాకినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తమ తాజా నివేదికలో తెలియజేసింది.
గత ఏడాది జూలైలో 3.9 మిలియన్ చదరపు అడుగులుగానే లీజులున్నాయి. ఈ ఏడాది జూన్లోనూ 5.8 మిలియన్ చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరుగగా, జూలైలో 3 మిలియన్ చదరపు అడుగులు పెరిగినట్టు జేఎల్ఎల్ ఇండియా ‘అగ్రిగేట్ మంత్లీ ఆఫీస్ లీజ్ ట్రాకర్’లో తేలింది.
కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు మళ్లీ ఆఫీస్ బాట పడుతున్నారు. ఆయా కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోంను గణనీయంగా తగ్గించేస్తున్నాయి. దీంతో ఆఫీస్ మార్కెట్లో లీజులు జోరందుకున్నాయి.
ఈ క్రమంలోనే రెండున్నరేండ్లలో ఎప్పుడూ కనిపించని ఉత్సాహం మార్కెట్లో నెలకొన్నది. కాగా, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, పుణె, కోల్కతాల్లో ఆఫీస్ మార్కెట్ తీరుతెన్నులను ఈ సర్వేలో జేఎల్ఎల్ ఇండియా ఆవిష్కరించింది. అన్ని రకాల, శ్రేణుల ఆఫీస్ బిల్డింగ్స్ కోసం జరిగే లీజులను పరిగణనలోకి తీసుకున్నారు. ముందస్తు ఒప్పందాలు, రెన్యువల్స్నూ లెక్కించారు.
చాలా సంస్థలు ఆఫీస్ స్పేస్ లీజుల్లో దీర్ఘకాలిక ఒప్పందాలకు పెద్దపీట వేస్తున్నాయి. అందుకే జూలై లీజుల్లో సుమారు 2.27 మిలియన్ చదరపు అడుగులు రెన్యువల్స్కు చెందినవే ఉన్నాయని జేఎల్ఎల్ తెలియజేసింది. టెక్నాలజీ సంస్థలు ఎక్కువగా ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకుంటున్నాయి. 53 శాతం వాటా వీటిదే. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగ సంస్థల వాటా 18 శాతం. మొత్తానికి 2020, 2021ల్లో కరోనా కారణంగా కుదేలైన దేశీయ ఆఫీస్ స్పేస్ మార్కెట్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో కోలుకుంటున్నది.