Celkon | హైదరాబాద్, జూలై 13 (బిజినెస్ బ్యూరో): మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో అగ్రగామిగా వెలుగొందుతున్న సెల్కాన్ గ్రూపు..తాజాగా టచ్ మొబైల్స్ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం టచ్ మొబైల్స్ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో 42 రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా సెల్కాన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై గురు మాట్లాడుతూ..మొబైల్ రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో టచ్ మొబైల్స్ను కొనుగోలు చేసినట్లు చెప్పారు.
ప్రస్తుతం టచ్ మొబైల్స్ పేరుతో 42 రిటైల్ అవుట్లెట్లు ఉండగా..వచ్చే ఏడాది చివరినాటికి దక్షిణాదితోపాటు మహారాష్ట్రలో 250 స్టోర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. వీటిలో సొంతంగా 50 స్టోర్లు, మిగతా 200 ఫ్రాంచైజ్ పద్దతిన నెలకొల్పాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 2022-23లో రూ.600 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ..వచ్చే మార్చి నాటికి రూ.2,000 కోట్లు ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణతోపాటు ఏపీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ళ ఆర్డర్లు రావడంతో టర్నోవర్ రెండింతలు పెరిగే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు.
హైదరాబాద్లో శిక్షణ కేంద్రం
ఎలక్ట్రానిక్స్ పరికరాల మరమ్మత్తులకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. యువతలో ఉన్న ప్రతిభను పెంపొందించడానికి సెల్కాన్ కట్టుబడి ఉన్నదని, .ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినట్లు, త్వరలో శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. తొలి దశలో 100 మందికి హైదరాబాద్తోపాటు తిరుపతిలోనూ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం కొంతమేర ఫీజు కూడా నిర్ణయించనున్నట్లు తెలిపారు. ఆరు నెలల కాలవ్యవధిలో శిక్షణ ఇవ్వనున్నారు.