న్యూఢిల్లీ, ఆగస్టు 26: ప్రభుత్వరంగ బ్యాంకుల బాస్ల రిటైర్మెంట్ వయస్సు పెంచేయోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ ఖారా పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ఎల్ఐసీ బాస్ల రిటైర్మెంట్ గడువును పొడగించాలని డిమాండ్ తెరపైకి వస్తున్నది.
ప్రస్తుతం పీఎస్బీల మేనేజింగ్ డైరెక్టల పదవీ కాలాన్ని 60 ఏండ్ల నుంచి 62 ఎండ్లకు పెంచేయోచనలో కేంద్రం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తుది నిర్ణయం ఇప్పటి వరకైతే తీసుకోలేదని, భవిష్యత్తులో తీసుకునే అవకాశాలున్నాయని ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. అక్టోబర్ 2020 నుంచి ఎస్బీఐ చైర్మన్గా ఖారా విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే రెండు నెలల్లో ఆయన పదవీ కాలం ముగియనున్నది.