ముంబై, సెప్టెంబర్ 22: ఫెడ్ ఫీవర్ భారత్ మార్కెట్లను ఇంకా పట్టిపీడిస్తున్నది. ఫలితమే వరుస నాలుగు రోజుల నష్టాలు. శుక్రవారం రోజంతా 500 పాయింట్ల శ్రేణిలో లాభనష్టాల మధ్య దోబూచులాడిన బీఎస్ఈ సెన్సెక్స్ తుదకు 221 పాయింట్లు పతనమై 66,009 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 19,674 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గ్లోబల్ మార్కెట్లలో ట్రెండ్ బలహీనంగా ఉండటం, విదేశీ ఫండ్స్ అదేపనిగా విక్రయాలు జరపడం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరులో జరిగిన భారీ అమ్మకాలు తదితర అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఈ వారంలో సెన్సెక్స్ 1,829 పాయింట్లు, నిఫ్టీ 518 పాయింట్ల చొప్పున పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లకు సంబంధించి గత రాత్రి అమెరికా స్టాక్ సూచీలు భారీ పతనాన్ని చవిచూడగా, శుక్రవారం సియోల్, టోక్యో మార్కెట్లు నష్టపోయాయి. షాంఘై, హాంకాంగ్లు గ్రీన్లో ముగిసాయి. అధిక వడ్డీ రేట్లు ఎక్కువకాలం కొనసాగుతాయన్న సంకేతాల్ని యూఎస్ ఫెడ్ వెల్లడించడంతో అమెరికా బాండ్ ఈల్డ్స్ 15 సంవత్సరాల గరిష్ఠానికి పెరగడంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు జరుగుతున్నాయని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అమోల్ అథేవాలా చెప్పారు.
విప్రో టాప్ లూజర్
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా విప్రో 2.32 శాతం పడిపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు 1-2 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి, ఎస్బీఐ, మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్లు 1-2 శాతం మధ్య లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే బీఎస్ఈ కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ అత్యధికంగా 0.84 శాతం తగ్గింది. రియల్టీ ఇండెక్స్ 0.73 శాతం, కమోడిటీస్ సూచి 0.62 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.45 శాతం చొప్పున క్షీణించాయి. బ్యాంకెక్స్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్లు లాభపడ్డాయి.
పీఎస్యూ బ్యాంకుల జోరు
జేపీ మోర్గాన్ గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్లో ఇండియా బాండ్లను చేర్చడంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. ఈ ఇండెక్స్లో చేరడంతో ఇండియా బాండ్లలోకి వచ్చే రోజుల్లో 20 బిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడులు రావచ్చని నోమురా సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఈ వార్తతో భారత ప్రభుత్వ 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ రెండు నెలల కనిష్ఠానికి తగ్గింది. అంటే బాండ్ల ధరలు పుంజుకున్నాయని భావించాలి. ప్రభుత్వ బాండ్లను పీఎస్యూ బ్యాంక్లే అధికంగా కలిగివున్నందున, ఆ షేర్లు పెరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. బీఎస్ఈ బ్యాంకింగ్ సూచి 3 శాతం ఎగిసింది.