Stock Market | యూఎస్, జపాన్, జర్మనీ తదితర ప్రధాన మార్కెట్లు ఏ రోజుకారోజు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్న నేపథ్యంలో భారత్ సూచీలు సైతం ఆల్టైమ్ హైకి చేరాయి. శనివారంతో సహా ఆరు రోజుల ట్రేడింగ్ వారంలో నిఫ్టీ 22,410 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన తర్వాత చివరకు వారం మొత్తమీద 165 పాయింట్ల లాభంతో 22,378 పాయింట్ల వద్ద నిలిచింది. కొత్త గరిష్ఠాలకు చేరినప్పటికీ మార్కెట్ పరుగు తీసేంతటి పటిష్ఠత వీక్లీ చార్టుల్లో కన్పించడం లేదని, ప్రస్తుత లేదా అధికస్థాయిలో కన్సాలిడేట్ కావచ్చని ఈక్విటీరీసెర్చ్.ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ విశ్లేషించారు. కాకపోతే ఈ వారం ట్రేడింగ్ శ్రేణి మరికొంత విస్త్రతం అవుతుందని, వోలటాలిటీ పెరుగుతుందన్నారు.
ఈ వారం నిఫ్టీకి సమీపంలోని 22,400 పాయింట్ల స్థాయి తొలుత అవరోధం కల్గించవచ్చని, ఈ స్థాయిని బలంగా దాటితే 22,650 పాయింట్ల వరకూ పెరగవచ్చని వైష్ణవ్ అంచనా వేశారు. దిగువస్థాయిలో 22,050, 21,850 స్థాయిలు మద్దతుగా నిలుస్తాయన్నారు. 22,200, 22,300 స్ట్రైక్స్ నుంచి కాల్ రైటర్లు వారి పొజిషన్లను అన్వైండ్ చేయడం ప్రారంభించినందున, ఈ వారం నిఫ్టీ 22,500 పాయింట్లకు చేరవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేశ్ పాల్వియా తెలిపారు. 22,200 పాయింట్ల స్థాయి స్వల్పకాలికంగా మద్దతు ఇస్తుందన్నారు. ఈ వారం నిఫ్టీ 22,500 పాయింట్లను, అందకంటే అధికస్థాయిల్ని అందుకోవచ్చని అంచనా వేస్తున్నట్టు ఎలిమెంట్స్ ప్లాట్ఫామ్స్ చైర్మన్ అజయ్ బగ్గా తెలిపారు.