న్యూఢిల్లీ, డిసెంబర్ 4: జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. జూలై 1, 2017న అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సరాసరిగా ఒక్కో నెలలో రూ.1.66 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు. లోకసభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రతినెలలోనూ రూ.1.50 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయని, ఏప్రిల్ 2023లో అయితే రికార్డు స్థాయి రూ.1.87 లక్షల కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. 2023-23 ఆర్థిక సంవత్సరంలో సగటు రూ.1.66 లక్షల కోట్లు కాగా, ఏడాది క్రితం వసూలైన దాంతో పోలిస్తే ఇది 11 శాతం అధికమని మంత్రి చెప్పారు. 2021-22లో సగటు రూ.1.23 లక్షల కోట్లు కాగా, అదే 2022-23లో రూ.1.50 లక్షల కోట్లు, 2020-21లో రూ.94,734 కోట్లుగా ఉన్నాయి.