Gautam Adani | ఈ ఏడాదిలో ప్రపంచంలోనే అపర కుబేరులు దాదాపు రెండు లక్షల కోట్ల డాలర్ల సంపద కోల్పోయారు. కానీ, ఐదుగురు బిలియనీర్లు మాత్రం గతేడాది (2021)తో పోలిస్తే 93 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద పెంచుకున్నారు. వారంతా ఆసియా ఖండం వారు.. వారిలో ఇద్దరు భారతీయులు.. టాప్-10లో అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ.. రెండో వ్యక్తి రవి జైపూరియా. వీరితోపాటు మరో ఇద్దరు చైనీయులు, ఒక ఇండోనేషియా వ్యాపారవేత్త వ్యక్తిగత సంపద భారీగా పెరిగింది. 2022 ప్రారంభంతో పోలిస్తే గౌతం అదానీ వ్యక్తిగత సంపద 55.1 బిలియన్ డాలర్లు పెరిగింది.
మన కరెన్సీలో రూ.4.56 లక్షల కోట్ల పై చిలుకు ( రూ.456765,50,05,000) పెరిగింది. అంటే అక్టోబర్ నెలాఖరులో టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. 44 బిలియన్ డాలర్లకు సోషల్ మీడియా దిగ్గజం `ట్విట్టర్`ను టేకోవర్ చేశారు. కేవలం ఒక్క ఏడాదిలోనే గౌతం అదానీ.. ఒక ట్విట్టర్ కొనుగోలు చేయగల స్థాయిలో వ్యక్తిగత సంపద కూడబెట్టారు. గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థలు.. విద్యుత్ ఉత్పత్తి మొదలు సిమెంట్, రియాల్టీ నుంచి పలు రంగాల్లోకి విస్తరించాయి.
గత ఫిబ్రవరి ప్రారంభంలో గౌతం అదానీ వ్యక్తిగత సంపద 90.1 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.746899,71,75,000.. అంటే రూ.7.46 లక్షల కోట్ల పై చిలుకు). ఫిబ్రవరిలో ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలోనూ పదో కుబేరుడిగా నిలిచారు. తీరా డిసెంబర్ వచ్చే సరికి అపర కుబేరుల్లో రెండో స్థానానికి దూసుకొచ్చారు. భారీగా వ్యక్తిగత సంపద 140 బిలియన్ డాలర్ల ( మన కరెన్సీలో రూ.11.60 లక్షల కోట్ల పై చిలుకు – రూ. 1160565,70,00,000)కు పెంచుకున్నారు. అంతే కాదు.. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, పోర్టులు, బొగ్గు, మీడియా సంస్థలను టేకోవర్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు అదానీ.
ఈ ఏడాదిలో వ్యక్తిగత సంపద పెంచుకున్న మరో బిలియనీర్ రవి జైపూరియా. ఆయన వ్యక్తిగత సంపద 9.3 బిలియన్ డాలర్లు. ఈ ఏడాదిలో 3.9 బిలియన్ డాలర్లు పెరిగింది. భారత్లోనే శీతల పానీయాలు, హెల్త్కేర్ తదితర సంస్థల కూటమి ఆర్జే కార్పొరేషన్ అధినేత. పెస్పిసోలో వరుణ్ బేవరేజస్ షేర్లు, వాటిపై మార్జిన్లు రెండింతలు పెరిగాయి. ఇతర జైపూరియా వెంచర్లలో దేవయానీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేర్లు 12 శాతం వృద్ధి చెందాయి.
ఇండోనేషియాకు చెందిన బొగ్గు వ్యాపారవేత్త లౌటక్ క్వాంగ్ నికర వ్యక్తిగత సంపద 18.6 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది 16 బిలియన్ డాలర్లు పెంచుకున్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగడంతో బొగ్గుకు గిరాకీ పెరిగింది. లిస్టెడ్ కోల్ మైనింగ్ సంస్థ బయాన్ రీసోర్సెస్ షేర్ మూడు రెట్లు ఎక్కువైంది. ఇండోనేషియాలో గతేడాది 18వ కుబేరుడిగా ఉన్న లౌటక్.. ఇప్పుడు రెండో స్థానానికి ఎగబ్రాకారు.
ఒకవైపు కరోనా మహమ్మారి.. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా హువాంగ్కు చెందిన డిస్కౌంట్ ఈ-కామర్స్ జెయింట్ కొలిన్ జెంగ్ హువాంగ్ వ్యక్తిగత సంపద 31.6 బిలియన్ డాలర్లు. ఈ ఏడాదిలో 11.1 బిలియన్ డాలర్లు వృద్ధి చెందింది. తక్కువ ధరలతో కస్టమర్లను ఆకర్షించడంతో మూడో త్రైమాసికం రెవెన్యూ 65 శాతం పెరిగింది. ఈ ఏడాది మొత్తంలో 35 శాతం షేర్ విలువ ఎక్కువైంది.
కొవిడ్ మహమ్మారి ఆట కట్టించేందుకు రూపొందించిన హెర్బల్ ఔషధంతో యు విల్లింగ్ సారధ్యంలోని షెంజ్జెన్ లిస్టెడ్ (చైనా) షిజియాజువాంగ్ విల్లింగ్ ఫార్మాస్యూటికల్స్ షేర్ 61 శాతం పైపైకి దూసుకెళ్లింది. కంపెనీ సేల్స్లో 46 శాతం.. కరోనా చికిత్సకే ఉపయోగించినట్లు ఈ ఏడాది మధ్యలో స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో యూ విల్లింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద 6.8 బిలియన్ డాలర్లు. ఈ ఒక్క ఏడాదిలోనే 4.1 బిలియన్ డాలర్లు పెరిగింది.