హైదరాబాద్, ఆగస్టు 27: విదేశీ కంపెనీలకు పరిశోధన కేంద్రంగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. తాజాగా అమెరికాకు చెందిన టెట్రా గ్లోబల్ అనుబంధ సంస్థయైన టెట్రా మెడ్సైన్సెస్ లిమిటెడ్ తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను గురువారం ప్రారంభించింది. కొత్త మాలిక్యూల్ను అభివృద్ధి చేయడంతోపాటు రాబోయే 5-10 ఏండ్లలో అవసరమైన మాలిక్యూల్స్ పోర్ట్ఫోలియోను దృష్టి సారించేందుకు ఈ ఆర్అండ్డీ కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ సందర్భంగా టెట్రా మెడ్సైన్సెస్ వ్యవస్థాపకురాలు లతా సుబ్రమణియం మాట్లాడుతూ ఫార్మా రంగంలో ఏపీఐ సరఫరా కొరత, ఉత్పాదక వ్యయ ప్రభావాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం..వీటిని అధిగమించడానికి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నదన్నారు.