వరుసగా మూడు వారాలపాటు లాభపడిన భారత మార్కెట్ చివరకు ప్రపంచ ప్రతికూల సంకేతాలకు తలొగ్గింది. గత వారం 2.3 శాతం నష్టపోయింది. ఇక ఈ వారం సూచీలకు పరీక్షా సమయం. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం డాటా వచ్చేదీ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం ప్రకటించేదీ ఈ వారమే. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠం 8.6 శాతానికి పెరిగిందన్న వార్తతో గత శుక్రవారం ఆ దేశపు మార్కెట్ భారీగా పతనమయ్యింది. ఫెడ్ ఈ నెల 15 మరో 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు మార్కెట్లో మొదలయ్యాయి.
గత సమీక్షలో ఇంతేశాతం రేట్లను పెంచిన ఫెడ్ ఇదేస్థాయిలో మరోసారి పెంచితే..వరుసగా రెండు సమీక్షల్లో 50 బేసిస్ పాయింట్ల చొప్పున రేట్లు పెంచడం 1994 తర్వాత తొలిసారి అవుతుంది. ఇక మే నెలకు దేశీ రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు సైతం మన మార్కెట్ను ఒడిదుడుకులకు లోనుచేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకూ అమెరికా ఎస్ అండ్ పీ500 సూచి 18 శాతం పతనంకాగా, నిఫ్టీ తగ్గింది 4 శాతమే. విదేశీ ఫండ్స్ అమ్ముతున్నా, దేశీ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో భారత్ సూచీల్లో క్షీణత తక్కువగా ఉన్నది. కానీ ఫెడ్ రేట్ల పెంపు, ఇక్కడి ద్రవ్యోల్బణం డాటా అంచనాలకంటే అధికంగా ఉంటే మన మార్కెట్ తట్టుకుని నిలబడటం కష్టమేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎస్జీఎక్స్ నిఫ్టీ 150 పాయింట్లకుపైగా నష్టపోయినందున, ఈ వారం గ్యాప్డౌన్తో మన మార్కెట్ మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ వారం నిఫ్టీకి 15,900 పాయింట్ల స్థాయి కీలక మద్దతుగా నిలుస్తుందని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. గ్యాప్ డౌన్తో మార్కెట్ మొదలైతే 16,100 వద్ద స్వల్ప మద్దతు ఉందని, ఆ దిగువన 15,900 మద్దతు కీలకమైనదని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది తెలిపారు. ఈ స్థాయిని బ్రేక్ చేయకపోతే నిఫ్టీ మరోసారి 16,800 పాయింట్ల వరకూ కొద్ది రోజుల్లో పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. నిఫ్టీ అన్ని కీలకమైన మూవింగ్ ఏవరేజ్లను కోల్పోయిందని, ముఖ్యంగా శుక్రవారంనాటి పతనం సాంకేతికంగా దెబ్బతీసిందని మార్కెట్ విశ్లేషకుడు మిలన్ వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం 16,315 పాయింట్ల వద్ద స్వల్పకాలిక 20 రోజుల మూవింగ్ ఏవరేజ్ను సైతం నిఫ్టీ వదులుకున్నదని, ఈ నేపథ్యంలో 16,000, 15,840 పాయింట్ల వద్ద మద్దతుస్థాయిల్ని పరీక్షించవచ్చన్నారు. మార్కెట్ పెరిగితే 16,400, 16,665 పాయింట్ల వద్ద అవరోధాలు కలగవచ్చని వివరించారు.