Tesla-Elon Musk | గుజరాత్లో ఎలన్ మస్క్ సారధ్యంలోని టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఉండబోవని ఆ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి బల్వంత్ సింగ్ రాజ్పుట్ స్పష్టం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో టెస్లా యూనిట్ ఏర్పాటు అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే వారం జరుగనున్న ‘వైబ్రంట్ గుజరాత్’ సదస్సుకు ఎలన్ మస్క్ హాజరవుతారా? లేదా? అన్న అంశంపై మంత్రి బల్వంత్ సింగ్ రాజ్పుట్ పై విధంగా స్పందించారు. అయితే, వైబ్రంట్ గుజరాత్ సదస్సులో టెస్లా యూనిట్ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని సంకేతాలిచ్చారు.
ఈ నెల 10-12 తేదీల మధ్య వైబ్రంట్ గుజరాత్ సదస్సు జరుగనున్నది. కాగా, ఇప్పటికే గుజరాత్ లో టెస్లా తన తొలి మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి బల్వంత్ సింగ్ రాజ్పుట్ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. రెండేండ్లలోపు టెస్లా కంపెనీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నది. ఈ ఏడాది మాత్రం దేశంలోకి కార్లను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇస్తారు.
మీడియా కథనాల ప్రకారం గుజరాత్ రాష్ట్రంలోని సనంద్, ధోలెరా, బెచరాజీ ప్రాంతాల్లో టెస్లా యూనిట్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. దేశీయంగా కార్ల విక్రయానికి, విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా గుజరాత్ రాష్ట్రంలోనే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టెస్లా కార్లపై దిగుమతి సుంకాలు 15-20 శాతం తగ్గిస్తారని గత నెలలో కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.