Tesla | ఎలన్ మస్క్ సారధ్యంలోని టెస్లా ఎలక్ట్రిక్ కార్లు భారత్ మార్కెట్లోకి ఎంటరయ్యేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. అందుకోసం త్వరలో కేంద్ర ప్రభుత్వం, టెస్లా మధ్య ఒప్పందం కుదురుతుందని ప్రభుత్వ వర్గాల కథనం. ఆ దిశగా అడుగులు పడుతున్నాయని బ్లూంబర్గ్ ఓ వార్తా కథనం వెలువరించింది. ఇంతకుముందు దేశీయంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తేనే దిగుమతి సుంకాలు తగ్గిస్తామని షరతు విధించిన కేంద్రం.. తాజాగా దేశంలో ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయడానికి టెస్లాకు రెండేండ్ల గడువు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
తొలుత భారత్ మార్కెట్లోకి టెస్లా కార్ల దిగుమతికి కేంద్రం అంగీకరించనున్నట్లు సమాచారం. కేంద్రం, టెస్లా మధ్య వచ్చే జనవరి నాటికి ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. జనవరిలోనే జరిగే ‘వైబ్రంట్ గుజరాత్’ సదస్సులోనూ ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. దీని ప్రకారం 2024 నుంచి భారత్ మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు దిగుమతి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో టెస్లా ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ వార్తా కథనం రాసింది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఆటోమొబైల్ పరిశ్రమలు ఉన్న సంగతి తెలిసిందే.
తొలుత భారత్ లో 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి టెస్లా సిద్ధమైనట్లు తెలుస్తున్నది. భారత్ మార్కెట్ నుంచి 1500 కోట్ల డాలర్ల విలువైన కార్ల విడి భాగాలను టెస్లా కొనుగోలు చేయనున్నది. ఎలక్ట్రిక్ కార్ల ధర మరింత తగ్గేలా.. దేశీయంగా బ్యాటరీల తయారీకి టెస్లా సిద్ధమైనట్లు వినికిడి. అయితే, దీనిపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. గత జూన్లో ఎలన్ మస్క్ స్పందిస్తూ.. 2024లో భారత్లో పర్యటిస్తామని చెప్పారు.
గతేడాది దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 1.3 శాతమే. సంప్రదాయ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దేశవ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్లు లేవు. అధిక దిగుమతి సుంకాల వల్ల భారత్ లోకి నేరుగా టెస్లా ఎలక్ట్రిక్ కార్లు దిగుమతి చేయడం లేదు. దేశీయంగా ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తే వాటి ధర 20 వేల డాలర్ల లోపే ఉంటుందని అంచనా.