న్యూయార్క్/న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ప్రపంచ కుబేరుడు, విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి ఎట్టకేలకు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ వచ్చింది. ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.63 లక్షల కోట్లు)తో కొన్నట్టు, గురువారమే ఈ డీల్ పూర్తయినట్టు శుక్రవారం మస్క్ ట్వీట్ చేశారు. కాగా, ఈ డీల్పై సందిగ్ధత నేపథ్యంలో ట్విట్టర్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారమే దీని విచారణ జరగనుండగా, అందుకు ఒక్కరోజు ముందే మస్క్ డీల్ను ముగించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నది.
అలాగే నెలల తరబడి ట్విట్టర్ వ్యాపారం, ఉద్యోగులు, వాటాదారుల భవితవ్యంపై నెలకొన్న ఉత్కంఠకూ తెరపడినైట్టెంది. ట్విట్టర్ తన సొంతమైన వెంటనే నలుగురు ఉన్నతోద్యోగులపై మస్క్ ఉక్కుపాదం మోపారు. భారత సంతతి సీఈవో పరాగ్ అగర్వాల్ను తొలగించేశారు. ట్విట్టర్తో డీల్ కుదిరిన దగ్గర్నుంచే పరాగ్పై వేటు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టే ఇప్పుడు పరాగ్ను మస్క్ బయటకు పంపించేశారు.
పరాగ్తోపాటు భారత సంతతికి చెందిన, తెలుగు మహిళైన లీగల్ అఫైర్స్, పాలసీ చీఫ్ విజయ గద్దెను కూడా తీసేశారు. అలాగే సంస్థ సీఎఫ్వో నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్గెట్లనూ తొలగిస్తున్నట్టు మస్క్ తాజాగా ప్రకటించారు. కాగా, వీరిలో ఒకరిని ట్విట్టర్ ఆఫీస్ నుంచి బలవంతంగా గెంటివేయడం.. ఉద్యోగులపట్ల మస్క్ ప్రవర్తించే తీరుకు అద్దం పడుతున్నది. సంస్థ ఉద్యోగుల్లో 25 శాతం మందిని తొలగిస్తానని ఇప్పటికే ప్రకటించిన మస్క్.. అంతకంటే ఎక్కువ మందినే తీసేయవచ్చన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు.
ట్విట్టర్ డీల్ను పూర్తిచేసిన మస్క్.. తనకు నచ్చని ఉన్నతోద్యోగులను తొలగించి పంతం నెరవేర్చుకున్నారు. అయితే వీరికి పెద్దమొత్తంలో నష్టపరిహారం అందవచ్చని సమాచారం. సంస్థలో చేరి ఏడాది కాకముందే తొలగింపునకు గురైన పరాగ్ అగర్వాల్కు కాంట్రాక్టు నిబంధనల ప్రకారం రూ.320 కోట్లు నష్టపరిహారంగా రావచ్చని చెప్తున్నారు. అలాగే విజయా గద్దెకు రూ.120 కోట్లు, సీఎఫ్వో నెడ్ సెగల్కు రూ.200 కోట్లకుపైగా, ఎడ్గెట్కు దాదాపు రూ.100 కోట్లు పరిహారంగా రావచ్చని అంచనా.
‘ది బర్డ్ ఈజ్ ఫ్రీడ్’ అంటూ ట్విట్టర్ను తాను ఎందుకు కొనుగోలు చేశానో మస్క్ వివరించారు. ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా ఎవరైనా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చని, ఇందుకు ఒక వేదిక కావాలనే ట్విట్టర్ను తాను కొన్నట్టు మస్క్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ లోగో పిట్ట బొమ్మను ఉద్దేశిస్తూ ‘పిట్టకు ఇక మరింత స్వేచ్ఛ’ మంచి రోజులు వచ్చాయంటూ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే ట్విట్టర్ కొత్త సీఈవోగా మస్క్ ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే గతంలో ట్విట్టర్ నిషేధించిన ట్రంప్సహా అందరి ఖాతాలు తిరిగి పునరుద్ధరించబడవచ్చని అంటున్నారు.
ట్విట్టర్ను మస్క్ హస్తగతం చేసుకోవడంపట్ల భారత్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. మస్క్ నాయకత్వంలో ట్విట్టర్ కొత్త రూపును సంతరించుకోగలదన్న ఆశాభావాన్ని కొందరు వ్యక్తం చేయగా, మరికొందరు దీనికి విరుద్ధంగా అభిప్రాయపడుతున్నారు. కాగా, నిరుడు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్సహా పలువురు రాజకీయ నాయకుల ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయడంతో దుమారం రేగిన సంగతి విదితమే. ఇదిలావుంటే మస్క్-ట్విట్టర్ డీల్.. మీమర్స్కు విందునిచ్చింది. నెటిజన్లు రకరకాలుగా దీనిపై మీమ్స్ సృష్టించి ఆనందిస్తున్నారు.
ట్విట్టర్లో దాదాపు 10 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా నిలిచిన మస్క్.. సంస్థను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ నకిలీ, స్పామ్ అకౌంట్ల గురించి తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారంటూ సీఈవో పరాగ్ అగర్వాల్పై మస్క్ మండిపడ్డారు. దీనివల్ల ట్విట్టర్కు తాను ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేయాల్సి వచ్చిందని దుయ్యబట్టారు. ఇక ఈ లావాదేవీలో చోటుచేసుకున్న తదనంతర పరిణామాలు సైతం పరాగ్, మస్క్ మధ్య దూరాన్ని మరింత పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ మస్క్ చేతికి వస్తే పరాగ్ వెళ్లిపోకతప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి. మస్క్ ఇప్పుడు వీటిని నిజం చేశారు. కాగా, 1984లో రాజస్థాన్లోని అజ్మేర్లో పరాగ్ అగర్వాల్ జన్మించారు. ఐఐటీ బాంబేలో బీటెక్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్, పీహెచ్డీ చేశారు. 2011లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ట్విట్టర్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన పరాగ్.. నిరుడు నవంబర్లో సీఈవోగా ఎన్నికయ్యారు.
ట్విట్టర్ లీగల్ అఫైర్స్, పాలసీ చీఫ్ విజయ గద్దె తెలుగువారే. 1974లో హైదరాబాద్లోనే జన్మించారు. అయితే తనకు మూడేండ్ల వయస్సులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే విద్యాభ్యాసం నడిచింది. ట్విట్టర్లో చేరకముందు న్యాయవాదిగా ఉన్న ఆమె.. 2011లో ట్విట్టర్లో చేరారు. న్యాయపరమైన అంశాల్లో తనకున్న అనుభవం విజయకు బాగా ఉపయోగపడింది. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా లీగల్ హెడ్గా విద్వేషపూరిత ప్రసంగాలు-ప్రకటనలు, ట్వీట్లు, వేధింపులు, తప్పుడు సమాచారంపై కఠినంగా వ్యవహరించారు. ఇందులో భాగంగానే ఎన్నికల సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తీసేశారు. ఈ చర్యను మస్క్ తీవ్రంగా తప్పుబట్టారు. అప్పట్నుంచే విజయను మస్క్ టార్గెట్ చేశారు. 2014లో ఫార్చ్యూన్ శక్తిమంతమైన మహిళల జాబితాలోనూ విజయ చోటు దక్కించుకోవడం గమనార్హం.
‘ఎలాన్ మస్క్కు నా శుభాకాంక్షలు. విద్వేష ప్రసంగాలకు ఇక ట్విట్టర్ వ్యతిరేకంగా ఉండగలదని ఆశిస్తున్నా. దేశంలో ప్రతిపక్షాల అణచివేత స్వరం వినిపించదని భావిస్తున్నా’
– రాహుల్గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు
‘ట్విట్టర్ను ఎవరు కొన్నారన్నది ప్రభుత్వానికి అనవసరం. భారతీయ నిబంధనలు అన్ని సంస్థలకూ ఒకేలా ఉంటాయి. వాటి ప్రకారమే ట్విట్టర్ కూడా నడవగలదని విశ్వసిస్తున్నాం’
-రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల సహాయ మంత్రి