Mobile Charges will Raise | మరోసారి పెంచే యోచనలో దేశీయ ప్రైవేట్ రంగ టెలికం సంస్థలు
ముంబై, మే 31: దేశీయ ప్రైవేట్ రంగ టెలికం సంస్థలు మరోసారి వినియోగదారులపై చార్జీల భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాప్-3 కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో మళ్లీ టారీఫ్లను పెంచవచ్చని సమాచారం. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవిన్యూలో 20-25 శాతం వృద్ధిని చూడాలనుకుంటున్నాయని భారతీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిసెర్చ్ మంగళవారం విడుదల చేసిన నివేదికనుబట్టి తెలుస్తున్నది. లాభాలూ 1.80-2.20 శాతం మేర పెరగవచ్చని ఇందులో క్రిసిల్ అంచనా వేసింది. కాగా, నెట్వర్క్, స్పెక్ట్రమ్ల్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) టెలికం సంస్థలకు కీలకం. ఏఆర్పీయూ అంతంతమాత్రంగా ఉంటే సేవలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టిన చాలాకాలం తర్వాత ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ మధ్య రిలయన్స్ జియో సైతం 2019 డిసెంబర్ నుంచి టారీఫ్లను పెంచడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
భారీ నష్టాలు.. దేశీయ టెలికం రంగంలో కన్సాలిడేషన్కు దారి తీయగా.. మొబైల్ టారీఫ్ల పెంపునకూ కారణమైంది. అంతకుముందు ఇంటర్నెట్, కాల్ చార్జీలు అత్యంత చౌకగా ఉండగా, ఇప్పుడు అవి పెద్ద ఎత్తునే పెరిగాయి. గతంతో పోల్చితే రెట్టింపయ్యాయన్నా అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో చాలామంది వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లలో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉన్నప్పటికీ.. సింగిల్ సిమ్నే వాడటం మొదలుపెట్టారు. నిజానికి చార్జీలను పెంచినా కాల్, మేసేజ్ సేవలు ఉచితంగానే ఉంటుండగా, ఇంటర్నెటే ప్రియమైంది. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు రకరకాల యాప్లను, సబ్స్క్రిప్షన్లనూ ఎరగా వేస్తున్నాయి. మొత్తానికి మరోసారి చార్జీలు పెరిగితే మొబైల్ కస్టమర్లకు అది శరాఘాతమేనన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఏఆర్పీయూ వృద్ధి 5 శాతంగానే ఉన్నది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం దీన్ని 15-20 శాతానికి పెంచుకోవాలని టెలికం సంస్థలు భావిస్తున్నాయి. అందుకే మళ్లీ చార్జీల పెంపు యోచనలో ఉన్నట్టు సమాచారం. అక్టోబర్ నుంచి ఈ వడ్డింపులు ఉండవచ్చని అంచనా. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం మూడు ప్రైవేట్ టెలికం సంస్థల యాక్టివ్ యూజర్లు 3 శాతం పెరిగారని, దీంతో 2.9 కోట్ల మంది వినియోగదారుల నుంచి మళ్లీ ఆదాయం రావడం మొదలైందని క్రిసిల్ తెలిపింది. దేశీయ టెలికం రంగంలో ఇప్పుడు ప్రైవేట్ రంగం నుంచి రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలుండగా, ప్రభుత్వ రంగం నుంచి బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్ మాత్రమే ఉన్నది.