హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): సేవారంగం ఎగుమతుల్లో తెలంగాణ దూసుకుపోతున్నదని కేంద్ర వాణిజ్యశాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ శ్రీకర్రెడ్డి, ఇంజినీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఈపీసీ) చైర్మన్ మహేశ్దేశాయ్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతోనే ఇది సాధ్యమవుతున్నదని చెప్పారు. ఎగుమతులతో ఎంఎస్ఎంఈల సాధికారత అనే అంశంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ తెలంగాణశాఖ గురువారం నిర్వహించిన సమ్మిట్లో వారు ప్రసంగించారు.
సేవారంగం ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో 8.1 శాతం వార్షిక వృద్ధి నమోదుచేసిందని, ఇది జాతీయ సగటు కంటే 4.7 శాతం ఎక్కువని వివరించారు. రాష్ట్రం నుంచి 2019-20 సంవత్సరంలో 7.4 బిలియన్ డాలర్ల ఎగుమతులయ్యాయని పేర్కొన్నారు. జీడీపీతోపాటు, దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలకభూమిక పోషిస్తున్నాయని, ఎగుమతులను పెంచాలని శ్రీకర్రెడ్డి సూచించారు. కొవిడ్ 19 వల్ల దేశంలోని ఎంఎస్ఎంఈలు 90 శాతానికిపైగా ప్రభావితమయ్యాయని వివరించారు.
పారిశ్రామికరంగం మానవవనరులు, ముడిసరుకులు, లాజిస్టిక్ కొరత లాంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేయాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటివరకు 38 శాతం సాధించినట్టు వెల్లడించారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ఎంఎస్ఎంఈలు వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో సీఐఐ చైర్మన్ సమీర్గోయెల్ తదితరులు పాల్గొన్నారు.