సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడటమే నా కోరిక
పాఠశాల, కళాశాల విద్యను హైదరాబాద్లో పూర్తిచేశా. నాన్న ప్రభుత్వ ఉద్యోగి, అమ్మ గృహిణి. ఎలాంటి భయం లేకుండా చాలా కాన్ఫిడెన్స్గా మెయిన్కు ప్రిపేరయ్యా. ఐఐటీ బాంబేలో సీఎస్ఈలో చేరాలని నా ఆలోచన. జీవితంలో సాఫ్ట్వేర్లో స్థిరపడాలని నా కోరిక. నా సోదరుడు ఇప్పటికే ఐఐటీ జోధ్పూర్లో చదువుతున్నారు. ఆయనను అనుసరించి నేను ఐఐటీవైపు అడుగేశా.
– రూపేశ్ బియాని
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్1 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. రాష్ర్టానికి చెందిన నలుగురు విద్యార్థులు వంద పర్సంటైల్తో అదరగొట్టారు. సోమవారం జేఈఈ మెయిన్ -1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. స్టేట్ టాపర్లుగా ధీరజ్ కురుకుంద, అనికేత్ చటోపాధ్యాయ్, జాస్తి యశ్వంత్ వీవీఎస్, రూపేశ్ బియాని నిలిచారు. జాతీయ స్థాయిలో పురుషుల విభాగంలో టాపర్గా అనికేత్ చటోపాధ్యాయ్ కాగా, రూపేశ్ 7వ ర్యాంకు, జాస్తి యశ్వంత్ వీవీఎస్ 8వ ర్యాంకు, ధీరజ్ కురుకుంద 9వ ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో జనరల్ కోటాలో ధీరజ్ కురుకుంద 6వ ర్యాంకు,రూపేష్ బియాని 7వ ర్యాంకు, జాస్తి యశ్వంత్ వీవీఎస్ 8వ ర్యాంకు, అనికేత్ ఛటోపధ్యాయ 9వ ర్యాంకును సొంతం చేసుకొన్నారు. జాతీయస్థాయిలో 14 మంది విద్యార్థులు మాత్రమే వందకు వంద పర్సంటైల్ను సాధించారు. వీరిలోనలుగురు విద్యార్థులు మన రాష్ర్టానికి చెందిన వారే కావడం గమనార్హం. ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈ ఏడాది జూన్ 24 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్ -1 పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 8.72 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. 7.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక పేపర్ 2ఏ(బీఆర్క్), 2బీ( బీ ప్లానింగ్) పేపర్ల ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి.
మంచి యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తా
నాకు నాన్న లేరు.. తల్లి గృహణి. చదువంటే ఎంతో ఇష్టం. కేకేఆర్ గౌతమ్ గుడివాడలో పాఠశాల విద్య పూర్తిచేశా. ఇంటర్ శ్రీచైతన్య మాదాపూర్ క్యాంపస్లో చదివా. నా చదువులకు మా కుటుంబం బాగా సపోర్ట్చేసింది. రోజూ ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు చదివాను. మెయిన్ -1లో 100 పర్సంటైల్ వచ్చింది కనుక, జేఈఈ మెయిన్ -2 అటెంప్ట్చేస్తా. ప్రస్తుతానికి అడ్వాన్స్డ్ కోసమే సీరియస్గా ప్రిపేరవుతున్నా. నా పర్సంటైల్ ప్రకారం ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్లో సీటు వస్తదని ఆశిస్తున్నా. బీఈ, బీటెక్ పూర్తిచేసి మంచి యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడమే నా లక్ష్యం.
జాస్తి యశ్వంత్ వీవీఎస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పరిశోధనలు చేస్తా
మాది హైదరాబాద్లోని మాదాపూర్. అమ్మ గృహిణి. నాన్న కర్ణాటక బ్యాంకులో ఉద్యోగి. పాఠశాల విద్య, ఇంటర్ హైదరాబాద్లో చదివా. రోజు 8గంటలు కష్టపడ్డా. ప్రిపరేషన్లో అధ్యాపకులు ఎంతో సహకరించారు. మెయిన్ -1లో 100 పర్సంటైల్ వచ్చినా.. మెయిన్ -2కు హాజరవుతా. ఐఐటీ బాంబే వర్సిటీని ఎంపిక చేసుకొని సీఎస్ఈ బ్రాంచిలో చేరుతా. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో పరిశోధనలు చేస్తా. – ధీరజ్ కురుకుంద
నేడు జేఈఈ మెయిన్ -2 దరఖాస్తుకు చాన్స్
జేఈఈ మెయిన్ -2 దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అధికారులు పొడిగించారు. మంగళవారం రాత్రి 11 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రాత్రి 11: 50 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. జేఈఈ మెయిన్ -2 ఎగ్జామ్స్ ఈ నెల 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.