వరంగల్, జూన్ 17 (నమస్తేతెలంగాణ): భారతదేశంలో తెలంగాణ అనతికాలంలోనే లీడింగ్ స్టేట్గా ఎదిగిందని భారత్లో దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జో బక్ కొనియాడారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని ప్రశంసించారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో దక్షిణ కొరియా టెక్స్టైల్ దిగ్గజం యంగ్వన్ కంపెనీ ఎవర్టాప్ టెక్స్టైల్, అప్పారెల్ కాంప్లెక్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో రూ.840 కోట్లతో నిర్మించనున్న వస్త్ర పరిశ్రమలకు మంత్రి కేటీఆర్తో కలిసి చాంగ్జో బక్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యంగ్వన్ కంపెనీ వస్త్ర ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో తమ దేశ దిగ్గజ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించటం సంతోషంగా ఉన్నదని చెప్పారు. టెక్స్టైల్ తయారీ, ఎగుమతుల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. భారత్, దక్షిణ కొరియా మధ్య బలమైన వాణిజ్య సంబంధాలున్నాయని, అవి మరింత బలపడేందుకు ఇలాంటి పెట్టుబడులు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. తమదేశ కంపెనీని ఆదరించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. యంగ్వన్ కంపెనీ చైర్మన్ కీ హాంగ్ సుంగ్ మాట్లాడుతూ తెలంగాణలో వస్త్ర పరిశ్రమలను పెట్టడం ఆనందంగా ఉన్నదన్నారు. తమది ప్రపంచంలో మంచి డిమాండ్ ఉన్న కంపెనీ అని, వరంగల్ టెక్స్టైల్ పార్కులో దశలవారీగా 11 విభాగాలు ప్రారంభించి వేలకొద్ది ఉ పాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
టెక్స్టైల్స్లో విప్లవాత్మక మార్పులు: కేటీఆర్
టెక్స్టైల్ రంగంలో తెలంగాణలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకొంటున్నాయని పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. టెక్స్టైల్ రంగంతో మన రాష్ట్రంలో జీవనోపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉన్నదని, ఫామ్ టూ ఫ్యాషన్ అనే లక్ష్యంతో సమగ్రంగా ఇక్కడే వస్ర్తాలు తయారు కావాలన్న సంకల్పంతో అత్యాధునిక టెక్స్టైల్ పార్కుకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కావటం గర్వంగా ఉన్నదని అన్నారు. ‘మన ప్రాంతంలోని నల్ల బంగారమే కాదు.. తెల్ల బంగారం కూడా అత్యుత్తమమైనదే. తెలంగాణలో పండే పత్తి దేశంలోనే నంబర్ వన్. ఇక్కడ అతి నాణ్యమైన పత్తితోపాటు నైపుణ్యంగల నేతన్నలు ఉన్నారు. వరంగల్కు పూర్వ వైభవం తెచ్చేందుకు కాకతీయుల పేరుతో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశాం. మెగా టెక్స్టైల్ పార్కు కోసం భూములిచ్చిన రైతులకు పేరుపేరునా కృతజ్ఞతలు. భూమిని సేకరించటంలో కృషి చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి అభినందనలు. టెక్స్టైల్ పార్కులో భూములు కోల్పోయినవారికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఆగస్టు 15లోగా ఈ పార్కులో లే ఔట్ పూర్తి చేసి ఒక్కొకరికి వంద గజాల స్థలం ఇస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ వస్ర్తాలు తయారు కానున్నాయి. ప్రపంచ విపణిలోకి మేడిన్ తెలంగాణ, మేడిన్ వరంగల్, మేడిన్ పరకాల దుస్తులు ప్రవేశించనున్నాయి’ అని వివరించారు.
మన పార్కును కాపీ కొట్టిన కేంద్రం
2015లో తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయగా, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు సోయి వచ్చిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును కాపీ కొట్టి పీఎం మిత్ర అనే పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు.0దేశంలో మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ ఇవాళ 30 శాతం అవార్డులను సొంతం చేసుకొన్నదని వెల్లడించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఇప్పటికే కిటెక్స్, గణేషా కంపెనీలు నిర్మాణ పనులను ప్రారంభించాయని, తాజాగా యంగ్వన్ కంపెనీ వస్త్ర పరిశ్రమల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. ‘యంగ్వన్ కంపెనీలో 21 వేల మందికి, కిటెక్స్లో 12 వేల మందికి, గణేషాలో వెయ్యి మందికి మొత్తం 33- 34 వేల మందికి ఇక్కడ ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా మరో 30 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. మొత్తం దాదాపు 60 వేల మందికి ఈ మూడు కంపెనీల ద్వారా ఉపాధి లభిస్తుంది. మరికొన్ని కంపెనీలను కూడా ఈ పార్కుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ రూ.600 కోట్లతో గణేషా కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది. కిటెక్స్లో సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సీఎం కేసీఆర్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. యంగ్వన్ కంపెనీ ఏర్పాటు చేయనున్న 11 ఫ్యాక్టరీల్లో మొదటి దశలో 4 ఫ్యాక్టరీలు ఉత్పత్తి ప్రారంభిస్తాయి. తర్వాత మిగతా 7 ఫ్యాక్టరీలను మొదలవుతాయి. తొలి దశలోని 4 ఫ్యాక్టరీల్లో 6 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పార్కులోని పరిశ్రమల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయి. అందులో 80 నుంచి 85 శాతం మహిళలే ఉంటారు’ అని వివరించారు.