హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ.. సంపన్నులకు స్వర్గసీమలా మారుతోంది. ఇటీవలి ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల జాబితాలో హైదరాబాద్ నుంచి నలుగురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకున్నారు. టాప్-100 కుబేరుల జాబితాలో దివీస్ లాబొరేటరీస్ అధినేత మురళీ దివీ, ఆయన కుటుంబం 6.3 బిలియన్ డాలర్ల సంపదతో 33వ స్థానంలో నిలిచింది. అలాగే మేఘా ఇంజినీరింగ్ ఎంటర్ప్రైజెస్ నుంచి పీపీ రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 4.05 బిలియన్ డాలర్ల సంపదతో 54వ స్థానంలో ఉన్నారు. ఇక 3 బిలియన్ డాలర్లతో రెడ్డీస్ ల్యాబ్ ఫ్యామిలీ 75వ స్థానంలో ఉన్నది.
అలాగే అరబిందో ఫార్మా అధిపతి పీవీ రాంప్రసాద్ రెడ్డి 2.35 బిలియన్ డాలర్ల సంపదతో 98వ స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలతో ఈ సంపన్నుల జాబితా రూపొందగా, రాష్ర్టానికి చెందిన ఫార్మా కంపెనీల అధిపతులు, వారి కుటుంబాలు ప్రాముఖ్యతను కనబర్చాయి. ఏండ్ల తరబడి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి రాష్ట్ర, దేశ సంపద సృష్టిలో వీరంతా కీలకపాత్ర పోషిస్తున్నారు.