సాంకేతిక మార్పులు పెట్టుబడులనూ ప్రభావితం చేస్తున్నాయి. ఇలా పరిచయమైనదే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. మదుపరులకు ఇదో నూతన శకంగానే చెప్పుకోవచ్చు. నేటి యువతరం సౌకర్యవంతమైన పెట్టుబడులకే ప్రాధాన్యతనిస్తున్నది. ఈ నేపథ్యంలో డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లకు ఆదరణ క్రమేణా పెరుగుతున్నదిప్పుడు. సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్స్, ఎలక్ట్రానిక్ రిసిప్ట్స్ వంటి పెట్టుబడులు.. యువ మదుపరులకు మూల్యాంకనాన్ని సులభతరం చేయడమేగాక.. సౌకర్యవంతంగా ఉండటం, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పిస్తున్నాయి.
సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)ను ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. గ్రాముల్లో లెక్కిస్తారు. ఒక గ్రాము అంటే ఒక యూనిట్. కనీస పెట్టుబడి ఒక గ్రాము. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకైతే గరిష్ఠ పరిమితి 4 కిలోలు. ట్రస్టులు తదితర సంస్థలకైతే 20 కిలోలు. బాండ్ కాలపరిమితి ఎనిమిదేండ్లు. ఐదేండ్లు గడిస్తే ముందుగానైనా ఉపసంహరించుకోవచ్చు. ఎస్జీబీలు స్టాక్ ఎక్సేంజీల్లో కూడా ట్రేడ్ అవుతాయి. బాండ్ ముఖ విలువ ఆధారంగా వడ్డీని, కమోడిటీ ధరల్లో ఒడిదుడుకుల నుంచి లాభాన్ని కూడా అందుకోవచ్చు. ఇక ఎస్జీబీలతో పరోక్ష పన్ను ఖర్చు ఆదా వంటివీ చేసుకోవచ్చు.
గోల్డ్ ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)లో కనిష్ఠంగా రూ.50 కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దీంతో రిటైల్ మదుపరులకూ ఇది అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు. ద్రవ్యోల్బణ సవాళ్లకు రక్షణగా ఈ పెట్టుబడి ఉపకరిస్తుంది.
ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ (ఈజీఆర్) అనేది పూర్తిగా కొత్త పెట్టుబడి సాధనం. భౌతిక బంగారాన్ని (నగలు, నాణేలు ఇతరత్రా) డిజిటల్ గోల్డ్ రూపంలోకి మార్చుకోవచ్చు. తమ వద్ద డిపాజిట్ చేసిన గోల్డ్కుగాను వాల్ట్ మేనేజర్ దీన్ని జారీ చేస్తారు. స్టాక్ ఎక్సేంజీల్లో ఇవి ట్రేడ్ అవుతాయి. స్టాక్ మార్కెట్లలో షేర్ల క్రయవిక్రయాల తరహాలోనే ఈజీఆర్ లావాదేవీలనూ మదుపరులు సులువుగా చేసుకోవచ్చు.
బంగారం ధర పెరిగితే వచ్చే లాభాలకుతోడు అదనంగా అనేక ప్రయోజనాలను ఈ డిజిటల్ గోల్డ్ సాధనాలతో మదుపరులు అందుకోవచ్చు. ఇతర ప్రత్యామ్నాయ పెట్టుబడులను ఒక్కసారి గమనిస్తే.. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై నిర్ణీత వడ్డీరేటే వస్తుంది. ఇక దశాబ్దకాలం కిందటే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ఆకర్షణ కోల్పోవడం మొదలైంది. భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈక్విటీ మార్కెట్లలోనూ పెట్టుబడులు ఏడాది కాలం నుంచి పెద్దగా లాభించడం లేదు. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల నడుమ మదుపరులకు బంగారం సహజంగానే ఓ ఆశాకిరణంగా కనిపిస్తున్నది. అయితే భౌతిక బంగారం క్రయవిక్రయాల్లో ఉన్న పరిమితులు, పన్నులు, అదనపు ఖర్చులేవీ.. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కు లేకపోవడంతో వీటికిప్పుడు డిమాండ్ ఉంటున్నది. ఎస్జీబీలపై పన్నేలేదు. కాబట్టి దీర్ఘకాల పెట్టుబడులకు ఆసక్తి చూపేవారు వీటిని పరిశీలించవచ్చు.
చివరగా: ఏ పెట్టుబడిలోనైనా మదుపరులకు లాభనష్టాలు అనేవి అత్యంత సాధారణం. రిస్క్ లేకుండా ప్రతిఫలం ఎందులోనూ రాదు. కనుక మీరు అనవసరపు ఒత్తిళ్లకు లోనుకాకుండా వీలైనంత వరకే పెట్టుబడులను పెట్టడం ఉత్తమం.