Layoffs | కొత్త వసంతంలో ప్రతి ఒక్కరూ మెరుగైన జీవితం సాగించాలని కోరుకుంటారు. కానీ టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న ప్రొఫెషనల్స్, ఎగ్జిక్యూటివ్లకు మాత్రం కాళరాత్రులు మిగులుస్తోంది. ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో గత రెండేండ్లుగా టెక్నాలజీ దిగ్గజ సంస్థలు పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. ఇప్పటికే కొత్త సంవత్సరంలో 15 రోజులు గడిచిపోయాయి. వేల మంది టెక్, స్టార్టప్ ఉద్యోగులకు ఉద్యోగాలు పోయాయి. 2023లోనే భారీగా ఉద్వాసనలు పలికిన టెక్ సంస్థలు.. ఈ సంవత్సరంలోనూ అదే వరవడి కొనసాగిస్తున్నాయి. ఈ నెల 15 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 48 టెక్ కంపెనీలు 7,528 మంది నిపుణులను ఇంటికి సాగనంపాయని లే-ఆఫ్ ట్రాకింగ్ వెబ్ సైట్ లే-ఆప్స్.ఎఫ్వైఐ ప్రకటించింది. ఈ ఉద్వాసనలు 2024లోనూ కఠిన నిర్ణయాలకు దారి తీస్తాయన్న సంకేతాలు వస్తున్నాయి. 2023లో 1150కి పైగా టెక్ కంపెనీలు 2.60 లక్షల మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇచ్చాయి.
గూగుల్, అమెజాన్ సహా బిగ్ టెక్ కంపెనీలు పొదుపు చర్యల్లో భాగంగా మరిన్ని ఉద్యోగాలు తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ ఏడాది 200 మంది సిబ్బందిని కేవలం ‘టూ మినిట్స్ గూగుల్ కాల్’లో ఇంటికి సాగనంపుతూ తొలిసారి ఆదేశాలు జారీ చేసిన సంస్థగా ఆన్లైన్ రెంటల్ ప్లాట్ ఫామ్ ‘ఫ్రంట్ డెస్క్’ నిలిచింది.
ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ గూగుల్.. డిజిటల్ అసిస్టెంట్, హార్డ్ వేర్ అండ్ ఇంజినీరింగ్ టీమ్స్ల్లో వందల మందిని ఇండ్లకు సాగనంపాలని నిర్ణయించుకున్నది. ఇక ఆన్ లైన్ ఆడియో బుక్ అండ్ పాడ్ కాస్ట్ సర్వీస్ అమెజాన్ అడిబుల్ సుమారు ఐదు శాతం ఉద్యోగులను తొలగించనున్నది.అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా స్టీమింగ్ అండ్ స్టూడియో ఆపరేషన్లలో వందల మందిని ఇంటికి పంపేసింది. లైవ్ స్ట్రీవింగ్ ప్లాట్ ఫామ్ ‘అమెజాన్ ట్విచ్’ 35 శాతం లేదా 500 మందిని ఇంటికి సాగనంపనున్నది.
సోషల్ చాట్ అండ్ మెసేజింగ్ స్టార్టప్ డిస్ కార్డ్ సిబ్బందిలో 17 శాతం (170 మంది) తొలగిస్తామని ఈ నెల 11న ఇంటర్నల్ మెమోలో తెలిపింది. ఇక వీడియో గేమ్ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ యూనిటీ సాఫ్ట్ వేర్.. సుమారు 25 శాతం సిబ్బంది అంటే 1800 మందిని ఇంటికి సాగనంపేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. ఐటీ కంపెనీ జిరాక్స్ సుమారు మూడు వేల మంది (15 శాతం) ఉద్యోగులను తొలగించనున్నది. అమెరికా బేస్డ్ ప్రాప్ టెక్ కంపెనీ ఫ్రంట్ డెస్క్ ఇప్పటికే 200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.