హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): జీ 20 సమ్మిట్లో భాగంగా గూగుల్-టీ హబ్ సంయుక్తంగా నిర్వహించిన 24 గంటల హ్యాకథాన్లో హైదరాబాద్కి చెందిన అగ్రిహీరోస్ స్టార్టప్ బృందం అద్భుత ప్రతిభను కనబర్చింది. శుక్రవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో ఈ హ్యాకథాన్ను నిర్వహించారు. ఇందులో చిన్న రైతులకు మద్దతుగా అవసరమైన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు డీప్టెక్ టెక్నాలజీతో అగ్రి హీరోస్ రూపొందించిన ఆలోచనకు తొలి స్థానం దక్కింది.
దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ చాలెంజ్కు సుమారు 270 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, ఐఎస్బీలో జరిగిన హ్యాకథాన్లో టీ హబ్, గూగుల్ సంస్థలు 40 బృందాలను ఎంపిక చేశాయి. అందులోంచి అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన అగ్రిహీరోస్కు నగదు బహుమతిగా రూ.5 లక్షలను అందజేశారు. వీటితో పాటు ఘజియాబాద్కు చెందిన టీమ్ ఇన్ఫెర్నోస్ ఆల్టర్నేట్ రియాల్టీకి రూ.2.5 లక్షలు, అదేవిధంగా హైదరాబాద్కు చెందిన మరో స్టార్టప్ బృందం టీమ్ లైట్ హెడ్స్కు లక్ష రూపాయలను బహుమతిగా అందజేశామని నిర్వాహకులు తెలిపారు.
జీ 20 స్టార్టప్ శిఖరాగ్ర సదస్సు ఐఎస్బీలో రెండు రోజుల పాటు జరిగింది. ఈ నెల 23, 24 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.