TCS WFH | కరోనాను నియంత్రించడానికి తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించిన ఐటీ సంస్థలు.. ఆ విధానానికి స్వస్తి పలుకనున్నాయి. ఈ ఏడాది చివరికి గానీ, వచ్చే ఏడాది ప్రారంభం నుంచి గానీ తమ ఉద్యోగుల్లో 70-80 శాతం మందిని ఆఫీసులకు తీసుకొస్తామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో రాజేశ్ గోపినాథన్ చెప్పారని ఓ ఆంగ్ల దినపత్రికలో వార్త ప్రచురితమైంది.
టీసీఎస్లో ఐదు లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతోపాటు కొత్త కేసులు తగ్గుముఖం పట్టడం దీనికి కారణంగా తెలుస్తున్నది. కోవిడ్-19 థర్డ్ వేవ్ ప్రభావాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారని సమాచారం.
టీసీఎస్ వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికితే మిగతా ఐటీ సంస్థలు అదే బాటలో పయనించే అవకాశం ఉంది. ఇప్పటికే మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ సిబ్బందికి ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధం కావాలని ఇంటర్నల్ మెమో జారీ చేసినట్లు వార్తలొచ్చాయి.