ముంబై, జూలై 9: దేశీయ ఐటీ రంగ ఫ్రెషర్స్కు శుభవార్త. భారతీయ ఐటీ దిగ్గజం, అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) భారీ ఎత్తున కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నది. క్యాంపస్ నియామకాల ద్వారా 40వేలకుపైగా ఫ్రెషర్స్ను సంస్థలోకి ఆహ్వానించనున్నామని టీసీఎస్ గ్లోబల్ హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ శుక్రవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం 5 లక్షలకుపైగా ఉద్యోగులున్న టీసీఎస్.. గత ఆర్థిక సంవత్సరం (2020-21) క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 40వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నది. ఈ నేపథ్యంలో ఈసారి అంతకుమించి నియామకాలను చేపట్టనున్నట్లు లక్కడ్ చెప్పారు.
టీసీఎస్లో ఉద్యోగం వస్తే ఇక తమ కెరీర్కు ఢోకా ఉండదన్న భావన దేశీయ ఐటీ ఉద్యోగార్థుల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. గతేడాది సంస్థ చేపట్టిన క్యాంపస్ నియామకాల్లో వర్చువల్ ఎంట్రెన్స్ టెస్టుకు ఏకంగా 3.60 లక్షల ఫ్రెషర్స్ హాజరవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది ఇంతకుమించి డిమాండ్ ఉంటుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా, ఈసారి ఉద్యోగాల్లోకి ఫ్రెషర్స్తోపాటు ఐటీ నిపుణులనూ తీసుకోవచ్చన్న సంకేతాలిచ్చారు. నిరుడు అమెరికన్ క్యాంపస్ల నుంచి 2వేల మంది ట్రైనీలను ఉద్యోగాల్లోకి తీసుకున్నామని చెప్పారు. ఈసారీ మరింత మందిని తీసుకుంటామన్నారు.
కరోనా వైరస్ ఎన్నో రంగాలను ప్రభావితం చేసినా.. ఐటీ రంగాన్ని మాత్రం పెద్దగా తాకలేకపోయిందనే చెప్పాలి. వర్క్ ఫ్రమ్ హోమ్తో ఐటీ ప్రాజెక్టులన్నీ యథాతథంగానే జరిగాయి. పైగా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేయడం వల్ల సంస్థాగత వ్యయం సైతం కొంతమేర తగ్గింది. ఈ ఏప్రిల్-జూన్లో టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయినా ఆకర్షణీయంగానే నమోదైయ్యాయి. దీంతో మరిన్ని సంస్థల లాభాలూ ఎప్పట్లాగే ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఐటీ కొలువులకు కరోనాతో ముప్పేమీ లేదంటున్నారు.