TCS | బీటెక్ పూర్తి చేసుకున్న ఇంజినీర్లకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తీపి కబురందించింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ ఇంజినీరింగ్ కాలేజీల్లో చేపట్టిన క్యాంపస్ సెలక్షన్లలో ఆఫర్ లెటర్లు అందజేసిన ఫ్రెషర్లందరినీ నియమించుకుంటామని టీసీఎస్ సీఈఓ కం ఎండీ కృతి వాసన్ తేల్చి చెప్పారు. ఈ ఏడాది సుమారు 40 వేల మంది ఫ్రెషర్ ఇంజినీర్లను నియమించుకుంటామని అన్నారు. కాలేజీ క్యాంపస్ల్లో జరిగిన సెలక్షన్లకు అనుగుణంగా ఆఫర్ లెటర్లు అందించిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి టీసీఎస్ కట్టుబడి ఉంటుందన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ప్రక్రియ ద్వారా 10 వేల మంది ఫ్రెషర్ల ఎంపిక ప్రక్రియ చేపట్టామని కృతివాసన్ చెప్పారు. కంపెనీకి స్థిరంగా ఆదాయ వ్రుద్ధి, ఆర్డర్లు వస్తున్నా ఉద్యోగుల సంఖ్య తగ్గడంపైనా ఆయన స్పందించారు. కాలేజీల్లో ఎంపికైన ట్రైనీ ఇంజినీర్ల నుంచి అంతర్గతంగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది నెలలకు ఉత్పాదక సేవలు అందుబాటులోకి రావన్నారు. క్యాంపస్ సెలెక్షన్లలో ఎంపికైన వారు ప్రాజెక్టులలో చేరడానికి సమయం తేడా ఉంటుందని, కనుక సిబ్బంది సంఖ్య తగ్గడాన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదన్నారు.