TCS | ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2015లో జరిగిన సామూహిక లేఆఫ్ల్లో ఉద్వాసనకు గురైన చెన్నై టెక్కీ తిరుమలాయి సెల్వన్ ఏడేండ్లుగా చేసిన న్యాయ పోరాటం ఫలించింది. చెన్నై నగర కోర్టు సెల్వన్కు అనుకూలంగా తీర్పు చెప్పింది. సర్వీసులో తిరిగి నియమించుకోవడంతోపాటు 2015 నుంచి ఇప్పటివరకు వేతనం, ఇతర బెనిఫిట్లు చెల్లించాలని ఆదేశించింది. తిరుమలాయి సెల్వన్ ప్రాథమికంగా స్కిల్డ్ వర్కర్ అని న్యాయస్థానం పేర్కొన్నది.
48 ఏండ్ల సెల్వన్.. ఎనిమిదేండ్ల పాటు టీసీఎస్లో మేనేజ్మెంట్ స్థాయిలో పని చేశారు. ఆయన పనితీరు అంచనాలకు అనుగుణంగా లేదని పేర్కొంటూ టీసీఎస్.. సెల్వన్కు ఉద్వాసన పలికింది. పిటిషనర్ తిరుమలాయి సెల్వన్ ఇతర విధులను వెల్లడించకుండా.. ఆయన డ్యూటీ పేరు చెప్పి మభ్య పెట్టడానికి ప్రయత్నించారని లేబర్ కోర్టు అభిప్రాయ పడింది.
కానీ టీసీఎస్ మాత్రం సెల్వన్ మేనేజ్మెంట్ క్యాడర్లో పని చేశారని, ఆయన వర్క్మన్ క్యాటగిరీలోకి రారని వాదించింది. మెకానికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేసిన సెల్వన్ నాలుగేండ్ల పాటు తన కోర్ సెక్టార్లో పని చేశారు. 2001లో సాఫ్ట్వేర్ రంగంలోకి వచ్చారు. రూ.లక్ష ఖర్చు చేసి ఓ కోర్సు నేర్చుకున్న తర్వాత టీసీఎస్లో అసిస్టెంట్ సిస్టమ్స్ ఇంజినీర్గా 2006లో నియమితులయ్యారు.
2015లో ఉద్వాసనకు గురి కావడంతో తిరుమలాయి సెల్వన్ కుటుంబ జీవనం కోసం సాఫ్ట్వేర్ ప్రాజెక్టులపై ఫ్రీలాన్స్ కన్సల్టెంట్గా పని చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీగా కూడా వ్యవహరించాడు. టీసీఎస్లో ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఆయన నెల వారీ వేతనం రూ.10 వేలకు చేరుకున్నది.