ముంబై, అక్టోబర్ 10: దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10,431 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.9,653 కోట్లతో పోలిస్తే 8.41 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18 శాతం ఎగబాకి రూ.54,309 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఇది 46,867 కోట్లుగా ఉన్నది. సేవల రంగంలో ఐటీ సేవలకు డిమాండ్ మరింతగా పెరిగిందని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేశ్ గోపినాథన్ తెలిపారు. అన్ని విభాగాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే లాభాల్లోనూ, అటు ఆదాయాల్లో భారీ వృద్ధి నమోదైందన్నారు.
ప్రస్తుతం కంపెనీ చేతిలో 8.1 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. అలాగే రూ.10,675 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.
ప్రతి షేరుకు రూ.8 డివిడెండ్ను కంపెనీ బోర్డు ప్రకటించింది.
రంగాలవారీగా చూస్తే రిటైల్ అండ్ సీపీజీ 22.9 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, కమ్యూనికేషన్స్ అండ్ మీడియా 18.7 శాతం, టెక్నాలజీ అండ్ సేవలు 15.9 శాతం, తయారీ రంగం 14.5 శాతం, బీఎఫ్ఎస్ఐ 13.1 శాతం చొప్పున పెరిగాయి.
సంస్థలో వలసలు 21.5 శాతంగా ఉన్నాయి. మొదటి త్రైమాసికంలో ఇది 19.7 శాతంగా ఉన్నది.
గడిచిన త్రైమాసికంలో సంస్థ 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నది. నికరంగా చూస్తే 9,840 మంది మాత్రమే. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 6,16,171కి చేరుకున్నారు.