TCS CEO Salary | ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో కం ఎండీగా ఉన్న రాజేశ్ గోపినాథన్ రాజీనామా చేశారు. ఆయన వారసుడిగా కే కృతివాసన్ సీఈవోగా వ్యవహరిస్తారని టీసీఎస్ ప్రకటించింది. అయితే, వచ్చే సెప్టెంబర్ 15 వరకు రాజేశ్ గోపీనాథన్ సీఈవోగా కొనసాగుతారని వెల్లడించింది. ఆరేండ్లుగా టీసీఎస్ సీఈవోగా పని చేసిన రాజేశ్ గోపినాథన్ వేతనం ఏటా రూ.25.75 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న వేతనం ఇది. అంతకుముందు 2020-21తో పోలిస్తే 26 శాతం వేతనం పెరిగింది. దేశంలోని ఇతర టెక్ దిగ్గజ సంస్థల సీఈవోలతో పోలిస్తే రాజేశ్ గోపినాథన్ శాలరీ కాసింత తక్కువే.
రాజేశ్ గోపినాథన్తో పోలిస్తే శాలరీ ప్యాకేజీ విషయంలో హెచ్సీఎల్ టెక్ సీఈవో సీ విజయ్కుమార్ మొదటి స్థానంలో నిలిచారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.123.13 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. దేశంలోని ఐదు అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో గరిష్ట వేతనం అందుకున్న సీఈవో విజయ్కుమార్ కావడం ఆసక్తికర పరిణామం. రెండో స్థానంలో ఉన్న విప్రో సీఈవో థెర్రీ డెలాఫోర్ట్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.79.8 కోట్ల వేతనం పొందారు. ఇన్పోషిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ.71.02 కోట్ల వేతన ప్యాకేజీతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. నాలుగో స్థానంలో ఉన్న టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ వేతనం రూ.63.4 కోట్లు. ఐదో స్థానంలో రాజేష్ గోపినాథన్.. అయితే ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్గా ఇటీవల రాజీనామా చేసిన మోహిత్ జోషి, వచ్చే డిసెంబర్లో టెక్ మహీంద్రా సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
టీసీఎస్.. దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో రెండో స్థానం. రిలయన్స్ తర్వాతీ స్థానం టీసీఎస్దే. ఐటీ దిగ్గజాల్లో అగ్రస్థానం టీసీఎస్దే. కానీ, ఆ సంస్థకు సీఈవోగా సారధ్యం వహిస్తున్న రాజేశ్ గోపినాథన్.. దేశంలోని ఐదు టెక్ దిగ్గజ సంస్థల సీఈఓల్లో అతి తక్కువ వేతన ప్యాకేజీ కలిగి ఉండటం ఆసక్తికర పరిణామం.