న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశవ్యాప్తంగా పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నా యి. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 27.07 లక్షల కోట్ల మేర పన్నులు వసూలైనట్లు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. బడ్జెట్లో అంచనావేసిన రూ.22.17 లక్షల కోట్ల కంటే అధికంగా వసూలవడం విశేషం. ప్రత్యక్ష పన్ను వసూళ్ళు అధికమవడంతో రికార్డు స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించారు. 2020-21లో వసూలైన రూ.20.27 లక్షల కోట్ల కంటే 34 శాతం అధికం.
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంచనావేసిన దానికంటే వ్యక్తిగత, ఆదాయ పన్ను వసూళ్ళు రూ.3.02 లక్షల కోట్లు పెరిగి రూ.14.10 లక్షల కోట్లు వసూలైనట్లు చెప్పారు. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 56 శాతం అధికమై రూ.8.58 లక్షల కోట్లకు చేరుకోగా, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు కూడా 43 శాతం అధికమై రూ.7.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో రూ.2.24 లక్షల కోట్లను ఐటీ రిఫండ్ రూపంలో చెల్లింపులు జరిపింది.
23 ఏండ్ల గరిష్ఠ స్థాయికి…
దేశ జీడీపీలో పన్ను వసూళ్ళ వాటా 23 ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. 2020-21లో 10.3 శాతంగా ఉన్న వాటా గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 11.70 శాతానికి పెరిగింది. 1999 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. ఆదాయ, కార్పొరేట్, కస్టమ్స్, జీఎస్టీ పన్ను వసూళ్ళు అధికమవడం ఇందుకు దోహదం చేశాయన్నారు.