వచ్చే ఐదేండ్లలో రూ.15,000 కోట్ల పెట్టుబడులకు యోచన
ఔరంగబాద్, మార్చి 15: రాబోయే ఐదేండ్లలో విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) విభాగంలో రూ.15,000 కోట్ల పెట్టుబడులను పెట్టే యోచనలో టాటా మోటర్స్ ఉన్నట్టు ఆ సంస్థ ప్యాసింజర్ వాహనాల వ్యాపార అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. ఇప్పటికే నెక్సాన్ వంటి ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో టాటా మోటర్స్ విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు మరో 10 సరికొత్త ఈవీలను పరిచయం చేయాలని చూస్తున్నామని శైలేష్ చెప్పారు. డిజైన్, డ్రైవింగ్ శ్రేణిలో కస్టమర్లకు నూతన అనుభూతి కలిగేలా వీటిని తీసుకొస్తామని తెలిపారు. ఈవీల అభివృద్ధికి ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టీపీజీ నుంచి 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఇప్పటికే టాటా మోటర్స్ సమీకరించింది. దీంతో టాటా ఈవీ వ్యాపారం విలువ 9.1 బిలియన్ డాలర్లను తాకింది. ఔరంగబాద్ మిషన్ ఫర్ గ్రీన్ మొబిలిటిలో భాగంగా నగరవాసులకు 101 ఈవీలను టాటా మోటర్స్ పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి శైలేష్ చంద్ర హాజరయ్యారు. ఏఎంజీఎంలో 250 ఈవీల ఆర్డర్లు అందుకున్నట్టు ఈ సందర్భంగా ఆయన చెప్పారు.