న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భారత్లో టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయనున్నదా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 తయారీని భారత్లో 2-3 నెలల్లో ప్రారంభించాలని యాపిల్ చూస్తున్నది. ఈ క్రమంలోనే యాపిల్ ప్రధాన సరఫరాదారుల్లో ఒకటైన తైవాన్కు చెందిన విస్ట్రన్ కంపెనీతో టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.
ఓ ఎలక్ట్రానిక్స్ జాయింట్ వెంచర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ఐఫోన్లను ఇక్కడ తయారు చేయాలన్నది టాటాల యోచనగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ప్రధాన తయారీదారుగా ఉన్న చైనాపై ఆధారపడటాన్నీ యాపిల్ తగ్గించుకోవాలని చూస్తుండటం కూడా ఇప్పుడు టాటాలకు కలిసొచ్చే వీలుందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. లాక్డౌన్లతో చైనాలో ఐఫోన్ల తయారీ ఇబ్బందికరంగా మారుతున్నది. దీంతో ప్రత్యామ్నాయాలపై యాపిల్ దృష్టి సారించింది. కాగా, డీల్ కుదిరితే ఐఫోన్లను భారత్లో తయారుచేసే తొలి భారతీయ కంపెనీగా కూడా టాటా గ్రూప్ రికార్డులకెక్కనున్నది.