Tata Technologies | దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టాటా సన్స్ అనుబంధ సంస్థ ఐపీవోకు వస్తోంది. ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీవో (Tata Technologies IPO) ఈ నెల 22న ప్రారంభమై 24న ముగియనున్నది. ఇంతకుముందు 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ ఐపీవోకు రావడం ఇదే తొలిసారి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టాటా సన్స్ నుంచి ఐపీవోకు వస్తుండటంతో ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ. టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) వంటి టాటా సన్స్ అనుబంధ సంస్థలకు సేవలందిస్తోంది టాటా టెక్నాలజీస్. ఐపీఓ ద్వారా టాటా టెక్నాలజీస్లో టాటా మోటార్స్ తన 11.4 శాతం వాటాను, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఆల్ఫా టీసీ హోల్డింగ్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1.2 శాతం షేర్లు విక్రయిస్తారు. టాటా టెక్నాలజీస్, టాటా మోటార్స్ ఉద్యోగులకు 10 శాతం షేర్లు రిజర్వు చేశారు.
టాటా టెక్నాలజీస్ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా జేఎం ఫైనాన్సియల్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్ బుక్ రన్నింగ్ సంస్థలు వ్యవహరిస్తాయి. టాటా టెక్నాలజీస్ ఐపీఓ సైజ్ ఎంత, షేర్ ధర ఎంత నిర్ణయిస్తారన్న సంగతి ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి తొమ్మిదో తేదీన ఐపీఓకు అనుమతి ఇవ్వాలని సెబీకి టాటా టెక్నాలజీస్ దరఖాస్తు చేసుకున్నది.