న్యూఢిల్లీ, నవంబర్ 24: సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ మదుపరులు పెట్టుబడి చేసేందుకు పరుగులు తీయడంతో టాటా టెక్నాలజీస్ ఐపీవో మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఆఫర్ ముగింపు రోజైన శుక్రవారం ఇది ఏకంగా 70 రెట్లు ఓవర్సబ్స్క్రయిబ్ అయ్యింది. కేవలం రెండు రోజుల్లోనే 50 లక్షలకుపైగా ఐపీవో దరఖాస్తులు అందుకుని రికార్డు నెలకొల్పింది. ఆటోమొబైల్, ఎయిర్లైన్ కంపెనీలకు డిజిటల్ ఇంజనీరింగ్, ప్రాడక్ట్ డెవలప్మెంట్ సర్వీసుల్ని అందించే టాటా టెక్నాలజీస్కు ఆఫర్ ప్రైస్ బ్యాండ్ను రూ.475-500గా నిర్ణయించారు.
15 ఏండ్ల క్రితం ఐపీవోకు వచ్చిన అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్, ఇటీవల ఆఫర్లు జారీచేసిన నైకా, జొమాటోకు అందిన అప్లికేషన్లకంటే టాటా టెక్నాలజీస్ అధికంగా సాధించిందని బ్రోకరేజ్ సంస్థ నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. టాటా టెక్నాలజీస్ ఐపీవోలో దాదాపు 4.50 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తుండగా, చివరిరోజునాటికి ఏకంగా 312 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. రూ.3,042 కోట్ల సమీకరణ కోసం ఆఫర్ జారీచేయగా, రెండు రోజుల క్రితమే యాంకర్ ఇన్వెస్టర్లకు (వివిధ సంస్థలు) రూ.791 కోట్ల విలువైన షేర్లను కంపెనీ కేటాయించింది. ఇష్యూలో మిగిలిన రూ.2,251 కోట్ల విలువైన షేర్లకు ఇన్వెసర్లు రూ.1,56,000 కోట్ల విలువైన బిడ్స్ సమర్పించారు. ఇప్పటివరకూ ఐపీవోలో అధిక మొత్తాన్ని (రూ.7.5 లక్షల కోట్లు) ఆకర్షించిన రికార్డు రిలయన్స్ పవర్ పేరిట ఉంది. దేశంలో అతిపెద్ద ఐపీవో (రూ.21,000 కోట్లు) అయిన ఎల్ఐసీ ఆఫర్ 2.95 రెట్లు మాత్రమే ఓవర్సబ్స్క్రయిబ్ అయ్యింది.
ఐపీవో శ్రేణి గరిష్ఠ ధరతో పోలిస్తే టాటా టెక్నాలజీస్ షేరు 80 శాతం అధిక ప్రీమియం గ్రే మార్కెట్లో పలుకుతున్నదన్న వార్తలు వెలువడటం పలు బ్రోకింగ్ కంపెనీలు ఈ ఇష్యూ పట్ల పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్ రేటింగ్లు ఇవ్వడం, టాటా గ్రూప్ నుంచి 19 ఏండ్ల తర్వాత జారీ అవుతున్న ఇష్యూకావడం తదితర అంశాలతో ఐపీవో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. 2004లో టాటా గ్రూప్ నుంచి వచ్చిన ఐటీ దిగ్గజం టీసీఎస్ ఐపీవోలో మదుపుచేసినవారికి ఇప్పటికే ఎన్నో రెట్ల లాభాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఐపీవో అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ.500 వద్ద టాటా టెక్నాలజీస్ పీఈ (ప్రైస్ టూ ఎర్నింగ్స్) 32.5 రెట్లు ఉన్నదని, ఇదే తరహా వ్యాపారంలో ఉన్న కేపీఐటీ టెక్నాలజీస్ 108.9 పీఈ, టాటా ఎలక్సి 68.5 పీఈ, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ 40 పీఈ వద్ద ట్రేడవుతున్నాయని ఎస్బీఐ సెక్యూరిటీస్ వివరించింది. సహ సంస్థలకంటే తక్కువ విలువకు లభిస్తున్నందున, ఆఫర్కు దరఖాస్తు చేయమంటూ సిఫార్సు చేసింది. ఇటువంటి సిఫార్సులు వెల్లువెత్తడంతో ఐపీవో ముగింపు రోజున ఇన్వెస్టర్లు క్యూ కట్టారు.
టాటా టెక్నాలజీస్ ఐపీవోలో షేర్లు దక్కించుకోవడానికి అత్యధికంగా సంస్థాగత ఇన్వెస్టర్లు పోటీపడ్డారు. అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్ల (క్యూఐబీలు) నుంచి ముగింపురోజున బిడ్స్ వెల్లువెత్తాయి. ఈ కోటాకు 1.05 కోట్ల షేర్లు కేటాయించగా, 203 రెట్లు ఓవర్సబ్స్క్రయిబ్ అయ్యింది. 214 కోట్ల షేర్లకు బిడ్స్ అందాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 78.87 కోట్ల షేర్లకు బిడ్చేయగా, దేశీయ సంస్థలు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ కలిసి 135 కోట్ల షేర్లకు బిడ్స్ వేశాయి. హై నెట్వర్త్ ఇన్వెస్టర్ల విభాగంలో రూ.10 లక్షలకు పైబడి మదుపు చేసే వారికోసం కేటాయించిన 52.73 లక్షల షేర్లకు 37.37 (70 రెట్లు) కోట్ల షేర్లను కోరుతూ బిడ్స్ అందాయి. రూ.2-10 లక్షల మధ్య ఇన్వెస్ట్చేసేవారి కోటాకు 45 రెట్లు బిడ్స్ వచ్చాయి. రూ.2 లక్షల లోపు మదుపు చేసే రిటైల్ ఇన్వెస్టర్లకు 1.85 కోట్ల షేర్లను రిజర్వ్చేయగా, అందుకు 16.50 రెట్లు 30.46 కోట్ల షేర్లకు సబ్స్క్రిప్షన్స్ అందాయి. టాటా టెక్నాలజీస్ షేరు డిసెంబర్ 5న లిస్టయ్యే అవకాశం ఉంది.