Air India To TATA | టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను టాటా సన్స్కు గురువారం కేంద్ర ప్రభుత్వం అప్పగించనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ముంబై నుంచి చంద్రశేఖరన్ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. టాటా సన్స్కు మహారాజాను అప్పగించనున్న నేపథ్యంలో ఎయిరిండియా బోర్డు సభ్యులు రాజీనామా చేస్తారు. బోర్డులో టాటా సన్స్ ప్రతినిధుల నియామకం పూర్తవుతుందని ప్రభుత్వ, టాటా సన్స్ వర్గాల కథనం. గతేడాది ఎయిరిండియా టేకోవర్ కోసం టాటా అనుబంధ టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన బిడ్ను కేంద్రం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టాటా సన్స్ చైర్మన్గా ఎయిరిండియా యాజమాన్య పత్రాలను చంద్రశేఖరన్ స్వీకరిస్తారని తెలుస్తున్నది.
రూ.18 వేల కోట్ల మొత్తానికి టాటా సన్స్కు ఎయిరిండియాను అప్పగించేందుకు అంగీకారం కుదిరింది. ఎయిర్ఇండియాలో 100 శాతం వాటాల విక్రయానికి సానుకూలంగా ఉన్నామని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం టాటా గ్రూప్కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) జారీ చేసింది. తర్వాత టాటా సన్స్కు మహారాజాను విక్రయిస్తూ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్పై కేంద్రం సంతకాలు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఎయిరిండియా ఎక్స్ప్రెస్తోపాటు గ్రౌండ్ హ్లాండింగ్ సంస్థ ఎయిరిండియా సాట్స్లో 50 శాతం వాటాలను టాటా సన్స్కు బదిలీ చేస్తారు.
ఎయిరిండియాను టేకోవర్ చేయడానికి టాటా సన్స్తోపాటు స్పైస్జెట్ ప్రమోటర్ అజియ్ సింగ్ సారధ్యంలోని కన్సార్టియం పోటీ పడింది. పూర్తిగా నష్టాల్లో కూరుకున్న ఎయిరిండియాలో 100 శాతం వాటాలను విక్రయించడానికి ప్రభుత్వం రిజర్వు ప్రైస్గా రూ.12,906 కోట్లుగా నిర్ణయించింది. రూ.18 వేల కోట్లకు టాటా సన్స్ బిడ్ దాఖలు చేసింది. అందులో రూ.2,700 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తుంది. మిగతా ఎయిరిండియా రుణాలను టాటా సన్స్ను చెల్లిస్తుంది.
2003-04లోనే ఎయిరిండియా ప్రైవేటీకరణకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పట్లో దాన్ని టేకోవర్ చేయడానికి ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. టాటా సన్స్ ఆధ్వర్యంలో సాగనున్న మూడో విమానయాన సంస్థగా ఎయిరిండియా నిలువనున్నది. ఇప్పటి వరకు ఎయిర్ ఏషియా ఇండియా, సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్తో విస్తారా ఎయిర్లైన్స్ టాటా నడుపుతోంది.
ప్రస్తుతం ఎయిరిండియాకు దేశీయంగా 4400కి పైగా, 1800 ఇంటర్నేషనల్ ల్యాండింగ్ అండ్ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. విదేశాల్లో 900 స్లాట్లు ఉన్నాయి. టాటా సన్స్ 1932లో టాటా ఎయిర్లైన్స్ స్థాపించింది. 1946లో ఎయిరిండియాగా రూపాంతరం చెందింది. 1953లో దీన్ని నాటి కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది. కానీ 1977 వరకు జేఆర్డీ టాటా.. ఎయిరిండియా బోర్డు చైర్మన్గా కొనసాగారు.