న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: తమ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) విభాగాన్ని సైతం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశ పెట్టాలని టాటా గ్రూప్ యోచిస్తున్నది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం)ను వచ్చే 12-18 నెలల్లో పబ్లిక్ ఇష్యూకు తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. 1-2 బిలియన్ డాలర్ల (గరిష్ఠంగా రూ.16,300 కోట్లు) నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) రావచ్చని చెప్తున్నారు. అయితే దేశంలో ఈవీల మార్కెట్నుబట్టి, కంపెనీ ఈవీలకున్న గిరాకీ ఆధారంగా దీనిపై స్పష్టత వచ్చే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఐపీవో సొమ్మును సంస్థ విస్తరణకు పెట్టుబడిగా వినియోగించనున్నారు. ఇక ఇప్పటికే టాటా గ్రూప్నకు చెందిన అనేక కంపెనీలు భారతీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతున్న విషయం తెలిసిందే. టీసీఎస్, టాటా మోటర్స్, టాటా పవర్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, టైటాన్ ఇలా ఎన్నో ఉన్నాయి.
టాటా మోటర్స్ అనుబంధ విభాగమే టీపీఈఎం. ప్రస్తుతం ఇది దేశంలోనే అతిపెద్ద విద్యుత్తు ఆధారిత వాహన తయారీ సంస్థగా ఉన్నది. మార్కెట్ లీడర్గానూ వెలుగొందుతున్నది. 80 శాతం వాటాను కలిగి ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. నెక్సాన్, టియాగో, పంచ్, టిగోర్ మాడళ్లను మార్కెట్లో విక్రయిస్తున్నది. ఎక్స్షోరూం ధరల శ్రేణి వాహన రకాన్నిబట్టి రూ.8 లక్షల నుంచి రూ.15.5 లక్షల మధ్య ఉన్నది. ప్రస్తుతం మెజారిటీ వాహనదారులు ఈవీలపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు కారణం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, కాలుష్యమే. ఇక ప్రభుత్వాలు సైతం ఈవీల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయి. పన్నులపై రాయితీలను అందిస్తుండటంతో ఎక్కువమంది వీటి కొనుగోలుకు ముందుకొస్తున్నారు. తెలంగాణలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈవీల వినియోగానికి తమ వంతుగా మద్దతునిచ్చిన సంగతి విదితమే.
దేశీయ విద్యుత్తు వాహన మార్కెట్లో తమకున్న అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న టాటా మోటర్స్.. వచ్చే 3-4 ఏండ్లలో సంస్థ పోర్ట్ఫోలియోలో 10 ఎలక్ట్రిక్ కార్లుండాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే మరిన్ని మాడళ్ల ఆవిష్కరణకు సిద్ధమవుతున్నది. అలాగే మార్కెట్లో ప్రత్యర్థి సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి వాహన ధరల్నీ తగ్గిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. ఇటీవలే కోమెట్ మాడల్ ధరను ఎంజీ సంస్థ తగ్గించడంతో.. టాటా కూడా తమ నెక్సాన్, టియాగో ఈవీల ధరల్ని దించేసింది. ఏకంగా రూ.1.2 లక్షల వరకు రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర ప్రస్తుతం రూ.14.49 లక్షల నుంచి ఉన్నది. టియాగో ఈవీ ధర కూడా రూ.7.9 లక్షల నుంచి మొదలవుతున్నది. నెక్సాన్పై రూ.1.2 లక్షల వరకు, టియాగోపై రూ.70,000ల వరకు తగ్గింపును సంస్థ ఇచ్చింది.